హైదరాబాద్లో భారీ పేలుళ్లకు సంబంధించిన కుట్రను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ఈ కుట్ర వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యూహం ఉందని ప్రాథమికంగా నిర్ధారించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కుట్రను ముందుగానే గుర్తించి భగ్నం చేసింది. విజయనగరంలో ఒక అనుమానాస్పద వ్యక్తి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, అతని ఇంటిపై దాడి చేసి, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సేకరించి పెట్టుకున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు.
సిరాజ్ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. సౌదీలో ఉన్న ఐసిస్ నేతల నుంచి వస్తున్న ఆదేశాల మేరకు స్థానికంగా కుట్రలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని గుర్తించారు. సిరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించగా, హైదరాబాద్లో ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి. బోయిగూడకు చెందిన లిఫ్ట్ ఆపరేటర్ సయ్యద్ సమీర్తో సిరాజ్కు నేరుగా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సమీర్-సిరాజ్కు ఆదేశాలు ఇచ్చింది. బ్లాస్ట్లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంతో పేలుళ్ల ముప్పు తప్పింది. వీరి మధ్య జరిగిన చాటింగ్, ఆన్లైన్ కొనుగోళ్లు, రసాయనాల సేకరణ వంటి అంశాలన్నీ నిఘా సంస్థలకు కీలక ఆధారాలుగా మారాయి.
ఇటీవల పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” పేరుతో పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు, ఆయా దేశాల్లోని వారి అనుబంధ నెట్వర్క్లు ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. యువతను మభ్యపెట్టి ఉగ్రవాదంలోకి నెట్టేందుకు ప్రలోభాలు, ప్రేరణలు ఇస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రలో నిందితులు ఉపయోగించిన పద్ధతులు, చాటింగ్ డేటా, టెక్నికల్ ఆధారాలను అన్నింటినీ ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఈ అరెస్టులు హైదరాబాద్ నగరం భద్రత విషయంలో మరోసారి అప్రమత్తం అయ్యేలా చేస్తున్నాయి.