తెలుగుదేశం పార్టీకి సంబంధించి త్వరలో కీలక మార్పులు చోటు చైసుకోనున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే 75 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా.. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 80కు చేరుతుందనే సంగతి తెలిసిందే. ఈ వయసులో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో అనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియకపోయినా, ఆరోగ్య పరంగా సానుకూలత ఉంటే పోటీ చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో, పార్టీ భవిష్యత్తుపై నారా లోకేశ్ ఫోకస్ పెంచారు. 2024 ఎన్నికల నాటికే పార్టీలో లోకేష్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కేబినెట్ ఏర్పాటు వరకు, అంతేకాకుండా.. ఎమ్మెల్సీ నామినేషన్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా లోకేశ్ దృష్టి మేరకే నిర్ణయాలు జరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన పార్టీలో ఏకైక నిర్ణాయక శక్తిగా ఎదిగినట్టు కనిపిస్తోంది.
2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లోకేశ్ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈసారి యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించే దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఇప్పటికే జిల్లాల వారీగా యువ నాయకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2024లోనే కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి, స్పష్టంగా తన మార్క్ చూపించారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హరిష్ మాథుర్, బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాశ్, ఎంఎస్ రాజు, విజయ్ పాత్రుడు వంటి అనేక మంది యువ నాయకులు ఉన్నారు. భూమా అఖిలప్రియ, పుత్తా చైతన్య రెడ్డి, జయనాగేశ్వర్ రెడ్డి వంటి యువతకు కూడా గతంలో అవకాశాలు ఇచ్చారు.
ఇక, సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న, పదవులు అనుభవించిన సీనియర్ నేతలను లోకేశ్ పక్కన పెట్టినట్లు సమాచారం. మూడుసార్లు వరుసగా పోటీ చేసి గెలిచిన నేతలకు ఇకపై అవకాశాలు ఉండకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమందిపై అవినీతి, అక్రమాల నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా వంటి నాయకులకు టికెట్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మాజీ మంత్రి యనమల విషయంలోనూ పలు కారణాల వల్ల పార్టీ దూరంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి పార్టీలో తన మార్క్ ఉండేలా లోకేష్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ.. వాటిని అమల్లోకి కూడా తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.