వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. తెల్లవారుజాము వరకూ జరిగిన చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించగా.. అనుకూలంగా 288.. వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. మొత్తం 14 గంటలకు పైగా చర్చ జరిగింది. గురువారం తెల్లవారుజామున 2:15 గంటల వరకు చర్చ జరిగింది. మొత్తానికి 56 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్జనశక్తి పార్టీలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇండియా కూటమి,ఎంఐఎం, వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే సభలోనే ఈ బిల్లు పేపర్లను చించేశారు.
ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా సుధీర్ఘం చర్చ జరిగే అవకాశం ఉంది. ఎగువ సభలో ఈ బిల్లు కోసం 8 గంటల సమయాన్ని కేటాయించారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందడం ఆనవాయితే అని చెప్పొచ్చు. కానీ చర్చ సమయంలో మాత్రం డైలాగ్ వార్ జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
రైల్వేలు, రక్షణశాఖ తర్వాత అత్యధిక భూమి ఉన్నది వక్ఫ్ బోర్డు ఆధీనంలోనే. అయితే ఆ ఆస్తులన్ని ప్రైవేట్ కిందకే వస్తాయని.. పేదలకు ఈ భూములు చెందాలన్న ఉద్దేశంతో ఈ నియమాన్ని తీసుకొచ్చారని.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇదే చేస్తుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రపంచంలో మైనారీలకు భారత్ కన్నా సురక్షితమైన దేశం మరోకటి లేదన్నారు బిల్లును ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు.
వక్ఫ్ సవరణ బిల్లుపై రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ముస్లింలను అణగదొక్కడం, వారి వ్యక్తిగత చట్టాలు, ఆస్తి హక్కులను ఆక్రమించుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు ఆయన. ఈ బిల్లు ముస్లింల హక్కులను కాలరాయడానికే అంటూ ఆరోపించారు.