మందుబాబులకు మళ్లీ షాకింగ్ న్యూస్ రెడీ అయ్యింది. త్వరలోనే లిక్కర్ రేట్లు పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చీప్ లిక్కర్ కాకుండా.. రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న మద్యం బాటిళ్లపై కనీసం 10 శాతం ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మద్యం బాటిల్పైనా కనీసం రూ.50 పెరిగవచ్చునని అంటున్నారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షించిన తర్వాత ధరల పెంపుపై సర్కారు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందని చెబుతున్నారు. రెండు, మూడు విధానాల్లో మద్యం రేట్లను పెంచి ఆ డీటెయిల్స్ను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఏయే విధానం ద్వారా ఎంత ఆదాయం సర్కారుకు పెరుగుతుందో కూడా ఆ రిపోర్టులో వెల్లడి అవుతుంది. అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మరింత లోతుగా అధ్యయనం చేసి మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. తక్కువలో తక్కువగా చూసినా.. రాష్ట్ర ప్రభుత్వానికి యేడాదికి రూ.2000 కోట్లు అదనపు రాబడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ధరలు పెరగడంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది.