పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ల ఇద్దరి రియాక్షన్.. సినిమా హీరో అరెస్టుపై రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
అల్లు అర్జున్ అరెస్టు చాలా బాధాకరమన్నారు లక్ష్మిపార్వతి. ప్రతిదానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని పేర్కొన్నారు. సినిమా ఎలా ఉందో చూడటానికి అల్లు అర్జున్ వెళ్లాడని.. అయితే, అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వం తప్పన్నారు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరులో ఘటనల సమయంలో ఎంతోమంది చనిపోయారని, మరి.. ఆ సంఘటనల్లో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో ఆయన శిష్యుడు ఉన్నారన్న లక్ష్మిపార్వతి.. రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మరోవైపు.. అల్లు అర్జున్ అరెస్ట్ను ప్రజాశాంతి పార్టీ నేత కేఏపాల్ తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. 2019లో జరిగిన పుష్కరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటకలో 23 మంది చనిపోయారని, అప్పడు అయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. చంద్రబాబుకో న్యాయం.. అల్లు అర్జున్ కో న్యాయమా అని కేఏ పాల్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే పోతే.. ఆర్టికల్14(ఎ) ఉల్లంఘన కింద కోర్టుకెళ్తానన్నారు.