లలిత్ మోడీ విభిన్నమైన వ్యక్తి. వ్యాపార కిటుకులు తెలిసిన వ్యక్తి. క్రికెట్కు కార్పొరేట్ రంగులు అద్దిన వ్యక్తి. అందువల్లే ఐపిఎల్ అనేది ఏర్పడింది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఐపీఎల్ను మానస పుత్రిక మాదిరి అభివృద్ధి చేసిన లలిత్ మోడీ.. ఆ తర్వాత దారి తప్పాడు. ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డాడు. ఫలితంగా ఆర్థిక నేరగాడిగా ముద్రపడ్డాడు. చివరికి దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం విదేశాలలో తల దాచుకుంటున్నాడు. అతడిని ఇండియాకి తీసుకురావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. విఫలమవుతూనే ఉన్నాయి.
లలిత్ మోడీ కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ లో ఉంటున్నాడు. ఆ మధ్య అతడు సుస్మితాసేన్ తో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా లలిత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 2010 నుంచి ఇంగ్లాండ్లో ఉంటున్న లలిత్.. తనను ఎప్పుడైనా సరే భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకెళ్లి ఇబ్బంది పడుతుందని భావించి.. ఇంగ్లాండ్ నుంచి వెళ్లిపోయాడు. ఏకంగా “వనౌటు”(Vanuatu) అనే దేశం పౌరసత్వం తీసుకున్నాడు. వనౌటు అనేది 65 ద్వీపాల సమూహం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ ఆదాయపు పన్ను.. ఇతర టాక్స్ లు ఉండవు. ఈ ప్రాంతం క్రిప్టో కరెన్సీకి స్వర్గధామంగా ఉంది.
2024 లో హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో ఈ దేశం తొలి స్థానంలో ఉంది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్.. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి వనౌటు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ దేశ పౌరసత్వం తీసుకోవడానికి లలిత్ ఎంత స్థాయిలో నగదు చెల్లించాడనేది తెలియ రాలేదు. దీంతో అతడు భారతదేశానికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అతడు పౌరసత్వం తీసుకున్న దేశంలో ఉన్న నిబంధనలే ఇందుకు అడ్డంకిగా మారాయి.
అయితే ఇంటర్ పోల్ జోక్యంతో లలిత్ మోడీ వనౌటు పౌరసత్వం రద్దయిందని వార్తలు వస్తున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి నపట్జోతం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. లలిత్ మోడీ వనౌటు గోల్డెన్ వీసా రద్దు చేస్తే ఇక ఇండియాకు తీసుకురావటం సులువవుతుంది. భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక సమాచారం రావల్సి ఉంది.