కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాల్లో అవకతవకలపై జస్టిస్ పినాకినీ చంద్రఘోష్ కమిషన్ విచారణ గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో బహిరంగ విచారణ పున: ప్రారంభమైంది. ఇవాళ జరిగిన విచారణకు గజ్వేల్ ఈఎన్సీ హరిరాంతో పాటు మాజీ ఈఎన్సీ (జనరల్) మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు), మాజీ ఈఎన్సీ (సీడీవో) నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఇప్పటికే వారంతా కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరై కమిషన్ అడిగిన ప్రశ్నలకు తమ స్టేట్మెంట్తో పాటు అఫిడవిట్లు కూడా సమర్పించారు. అయితే, అనూహ్యంగా అఫిడవిట్లో ఇచ్చిన వివరాలకు, విచారణలో చెప్పిన విషయాలకు ఎక్కడ పొంతన లేనట్లుగా కమిషన్ సభ్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారించాలని కమిషన్ వారిని విచారణకు రావాలంటూ సమాచారం అందజేసింది. దీంతో ఈఎన్సీలు మరోసారి బహిరంగ విచారణకు హాజరయ్యారు. కాగా, కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు 109 మందిని విచారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, సీసీ డిజైన్లు, ఓఅండ్ఎం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో పని చేసిన ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి మాజీ, ప్రస్తుత సెక్రటరీలు, కమిషన్ ఎదుట అఫిడవిట్లు దాఖలు చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొత్తం 400 పేజీలతో నివేదికను సిద్ధం చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.