డేర్ డెవిల్ జర్నలిస్టుగా గుర్తింపు
మరోవైపు రచయితగానూ రాణింపు
ఇప్పుడు కవిత్వంలోనూ నేర్పు
ప్రస్తుతం సమాచార కమిషనర్గా బాధ్యతలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రెహనాకు20 ఏళ్ల పాత్రికేయ నేపథ్యం ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు రెహనా. సాహసోపేతమైన కవరేజ్ తో రెహనా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రైనీ రిపోర్టర్ గా ఉన్నప్పుడే హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో వృద్ధ అరబ్ షేక్ల కాంట్రాక్ట్ వివాహాలను రహస్య కెమెరాలో బంధించి ఆ సామాజిక దురాగతాన్ని ప్రపంచానికి చూపించిన సాహసి రెహానా. ఆ విధంగా స్టింగ్ ఆపరేషన్లతో తన కెరీర్ ప్రారంభించిన రెహనా.. అదే ధైర్యనాన్ని కొనసాగించారు. ఒక పక్కన తుపాకులు పేలుతుంటే.. మరోవైపు లైవ్ కవరేజ్ చేసిన డేర్ డెవిల్ జర్నలిస్ట్. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నుంచి పాక్ సరిహద్లుల్లో సర్జికల్ స్ట్రైక్స్ వరకు.. ఉత్తరాఖండ్ వరదల బీభత్సం నుంచి టర్కీ తీవ్ర భూకంపం వరకు రెహనా అందించిన జాతీయ, అంతర్జాతీయ వార్తల కవరేజ్ జాబితాలో ఉన్నాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను సమాజం ముందు పెట్టడం కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టడం ఆమె నైజం. భారత్- పాకిస్తాన్, భారత్- బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఒక జర్నలిస్ట్గా ప్రయాణించి వాస్తవ పరిస్థితులను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా అందించడమే కాకుండా ఒక రచయితగా తన అనుభవాలను “సరిహద్దుల్లో…” పేరుతో పుస్తకాన్ని సైతం వెలువరించారు. ప్రధానంగా పొలిటికల్ జర్నలిస్ట్ అయిన రెహానా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టింగ్ చేశారు. ఉత్తరాన జమ్ము-కాశ్మీర్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు, పశ్చిమాన గుజరాత్ నుంచి తూర్పున త్రిపుర వరకు ఆమె కవర్ చేయని రాష్ట్రం లేదు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బిహార్ వంటి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కవరేజ్ చేశారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు చేసిన రికార్డ్ రెహానా ఖాతాలో ఉంది. ప్రస్తుత మన ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఇంటర్వ్యూ చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఒక జర్నలిస్ట్గా సామాజిక అంశాల పరిష్కారంపై రెహానా చూపిన నిబద్దత వల్ల 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార కమిషనర్గా ఎంపిక చేసింది.
సాహిత్యాభిలాష:
పాత్రికేయ వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా.. సాహిత్యంతో రెహానా తన అనుబంధాన్ని కొనసాగిస్తూ రావటం విశేషం. ఆమె రాసిన కథలు, కవిత్వాలు పలు పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితం అయ్యాయి. కథ, కవిత్వం రెండు శైలుల్లోనూ రచనలు చేస్తున్న అతికొద్ది మందిలో రెహానా ఒకరు. తాజాగా వెలువరించిన “నదీ వాక్యం” రెహానా రాసిన నాలుగో పుస్తకం, అలాగే.. మొదటి కవితా సంపుటి. దీని కంటే ముందు ఆమె రాసిన ‘సరిహద్దుల్లో…’, ‘పెన్ డ్రైవ్’, ‘టర్కీ @7.8’ పుస్తకాలు పాఠకుల ఆదరణ పొందాయి. ‘సరిహద్దుల్లో…’, ‘టర్కీ @7.8’ పుస్తకాలు ఇంగ్లీష్లోకి సైతం అనువాదం అయ్యాయి.
పరిశోధనా విద్యార్ధి:
నిత్య విద్యార్ధిగా అకడమిక్, పరిశోధనల్లోనూ రెహానా చేస్తున్న కృషి విశిష్టంగా చెప్పొచ్చు. అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యం. అంతర్జాతీయ వార్తల కవరేజ్ అంశంపై ఆరేళ్ల పాటు పరిశోధన చేసి ఆమె తన థీసిస్ సమర్పించారు. రైతుల ఆత్మహత్యలు, భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై రెహానా రాసిన నాలుగు పరిశోధన పత్రాలు ప్రముఖ రీసెర్చ్ జర్నల్స్లో ప్రచురితం అయ్యాయి. అమెరికా కాన్సులేట్ జనరల్ సౌజన్యంతో “కౌంటరింగ్ మిస్ ఇన్ఫర్మేషన్” కోర్సును కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.