తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన శుభకార్యాల్లోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పార్టీ నాయకుల్లో భరోసా, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజధానిలో బిజీగా ఉన్నప్పటికీ.. పార్టీకి సేవ చేస్తున్న.. పార్టీలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేజెల్ల సురేష్ కూతురు రిషిత – ధీరజ్ల వివాహానికి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించారు.
అలాగే, బోనకల్ మండలం రావినూతల గ్రామంలోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. రావినూతలలో యూత్ కాంగ్రెస్ నాయకుడు బద్రు నాయక్ సోదరి వివాహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. వధూవరులు శిరీష – విజయ్ కుమార్లను ఆశీర్వదించారు. అక్కడ కూడా కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట.. కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.