తెలంగాణలో ఇక కొలువుల జాతర మొదలు కానుంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో రేవంత్ సర్కారు ఇక ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే.. ఏప్రిల్లోనే ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారట.
మొదటగా ప్రభుత్వంలో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తిస్తారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయగా, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ ముగిసే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వబోమని చెప్పింది. ఈ కారణంగానే గత ఏడాది సెప్టెంబరు నుంచి నియామక ప్రకటనలు రాలేదు. ఇక, ఈ నెల 14వ తేదీ నుంచి వర్గీకరణ అమల్లోకి రావడంతో ఇప్పుడు సర్కారు మళ్లీ ఉద్యోగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించనుంది. ఆర్టీసీ, వైద్య విభాగాల్లో 10 వేల వరకు ఉద్యోగాలు ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా.. మరోసారి గ్రూప్-1 ప్రకటన జారీ కోసం పోస్టులను అధికారులు గుర్తిస్తున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలు, పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1,2,3,4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ సమయంలో ఏయే పరీక్షలు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఏప్రిల్లోనే మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్ వాడీ, ఆరోగ్య శాఖలో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని సర్కారు ప్రణాళిక వేసుకుంటోంది.