- పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ లోనే నగదు, ఆభరణాల అఫిడవిట్ ఇచ్చేలా చట్టం
- బెంగళూరు టెకీ సూసైడ్ నేపధ్యంలో సుప్రీం కోర్టులో పిల్
- వరకట్న వేధింపులు, గ్రుహ హింస చట్టాల దుర్వినియోగం
- న్యాయనిపుణులు, మాజీ జడ్జిలతో సమీక్షించాలంటూ పిల్ లో డిమాండ్
బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మ హత్య నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలను పునస్సమీక్షించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్) దాఖలైంది.మాజీ జడ్జిలు, న్యాయ నిపుణులు, లీగల్ జ్యూరిస్టులతో కూడిన కమిటీ ఈ చట్టాలను సమీక్షించి దుర్వినియోగం అవకుండా అవసరమైన సంస్కరణలు సూచించాలంటూ ఆ పిల్ లో కోరారు. వివాహ రిజిస్ట్రేషన్ సమయంలోనే వధూ వరులకు లభించిన గిఫ్టులు, నగదు, నగలు, ఆభరణాలరూపంలో ఉన్న ఇతర బహుమానాల జాబితాను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆ రికార్డును వివాహాల రిజిస్ట్రేషన్ రికార్డుతో భద్రపరచాలని రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాలని ఆ పిల్ లో కోరారు. ప్రీతిగుప్తావర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, అచిన్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా క్రిమినల్ అపీల్ నెంబర్2379\ 2024 03.05.2024న భర్త, అత్తింటి వారి వేధింపుల కేసులోఇచ్చిన తీర్పు ఆధారంగా అవసరమైతే రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాలని ఆ పిటిషన్ లో కోరారు.
చర్చకు తెరలేపిన అతుల్ సుభాష్ సూసైడ్ నోట్
బెంగళూరులో అతుల్ సుభాష్అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య, ఇతర బంధువులు అబద్ధపు ఆరోపణలు,అసంబద్ధ డిమాండ్లతో తనను వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం తాను వేధిస్తున్నట్లు తప్పుడు కేసు పెట్టి తనను యూపీకి చెందిన భార్య నికితా సింఘానియాని , ఆమె బంధువులు కొన్నాళ్లుగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, న్యాయ పరిధిలో కూడా తనకు అన్యాయమే జరుగుతోందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన భార్య కేసు యూపీలోని జానూపూర్ లో ఫైల్ చేయడంతో తాను దాదాపు 40 సార్లు కోర్టుకేసు విచారణకు హాజరవ్వాల్సి వచ్చిందని తనకు న్యాయందక్కకపోగా పిటిషనర్ కు వత్తాసుగా సదరు జడ్జి వ్యవహరించి తనను అవహేళన చేసినట్లు, కేసు సెటిల్ అవడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు అతుల్ తన 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ లో ప్రస్తావించాడు. తనను ఒక ఏటీఎంమిషన్ లా ఆ కుటుంబం వాడుకుంటోందని, తనకు జీవితం మీద విరక్తి వస్తోందని, ఈ తప్పుడుకేసు వేధింపులతో తనకు అప్పులు పెరిగాయని వాపోయాడు.
భార్యకు మద్దతుగా జడ్జి అపహాస్యపు నవ్వు
మొదట విడాకులివ్వాలంటే కోటి రూపాయలు డిమాండ్ చేసిందని, ఆ తర్వాత దానిని మూడు కోట్లకు పెంచిందని అతుల్ తన నోట్ లో ప్రస్తావించాడు. ఇదే విషయాన్ని కేసును విచారిస్తున్న జడ్జికి చెప్పగా నీ దగ్గర డబ్బులుఎక్కువ ఉన్నాయేమో అనే వెటకారపు వ్యాఖ్యలు చేశాడని అతుల్ తెలిపాడు. తనపై పెట్టిన వరకట్న వేధింపులు కేసు అబద్ధమని చాలా మంది భర్తలు ఇలాంటి తప్పుడు కేసులతో గత్యంతరం లేక చనిపోతున్నారని తాను ఆధారాలతో కూడి డాక్యుమెంట్లను జడ్జికి చూపితే అయితే నువ్వు కూడా చనిపో అని అక్కడే ఉన్న తన భార్య కామెంట్ చేసిందని దానికి జడ్జి వెటకారంగా నవ్వాడనీ అతుల్ తెలిపాడు.
అత్త, మామలూ వేధించారు..
తన అత్తగారు కూడా కోర్టు ప్రాంగణంలో ఎదురుపడి ఇంకా చనిపోలేదా? నువ్వు పోతే నీ ఆస్తి అంతా నా కుమార్తెకు వస్తుందని కామెంట్ చేసేదని అతుల్ తెలిపాడు. ఒక వైపు పెరుగుతున్నఅప్పులు, కేసు సెటిల్ అవకపోవడం క్షణ క్షణానికి పిటిషనర్ తన పైనా, తన తల్లిదండ్రులపైనా వరకట్న వేధింపుల కేసు పెట్టి తనను వేధిస్తుండటంతో తనకు న్యాయవ్యవస్థ పై నమ్మకం పోయిందని, తన మరణమైనా కనువిప్పు కలిగించి ఆ చట్టాలను సంస్కరించాలని సామాన్యునికి న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. అతుల్ రాసిన సూసైడ్ నోట్ హ్రుదయాన్ని ద్రవింప చేసేలా ఉంది. తన కుమారునికి కారు కొనివ్వాలన్న డిమాండ్ తో తాను ఉద్యోగంలో మరింత సంపాదన కోసం ఎక్కువపని చేయాల్సి వస్తోందన్నాడు. తన మరణంతో ఇక ఆ అవసరం ఉండదని కూడా అతుల్ వాపోయాడు.
దుర్వినియోగం అవుతున్న వరకట్న చట్టాలు
భారతీయ న్యాయ సంహితలోని వరకట్న వేధింపుల నుంచి, గ్రుహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ పకడ్బందీగా తీసుకొచ్చిన చట్టం దురద్రుష్ట వశాత్తు కొన్ని సార్లు దుర్వినియోగం అవుతోందని ఆ కేసును అడ్డు పెట్టుకుని భర్తలను అనేకమంది మహిళలు వేధింపులకు పాల్పడుతున్నారనే వాదనలు అతుల్ సుభాష్ మరణంతో మరోసారి చర్చకు వస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే సుప్రీం కోర్టులో ఈ పిల్ దాఖలైంది.