రైతు రుణమాఫీపై ఓ రైతు విడుదల చేసిన వీడియోపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. నిర్మల్ జిల్లా బాసర మండలం లబ్దీ గ్రామానికి చెందిన సిందే సిరాజీ అనే రైతు తల్లికి రూ.2లక్షల 25 వేల రుణం ఉంటే, ఇదివరకే 25 వేలు చెల్లించారు. అయినా రుణమాఫీ లిస్టులో తన తల్లి పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సిరాజ్ విడుదల చేసిన వీడియో పోలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సిరాజీ సీఎం సారు నేను గుర్తున్నానా! మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, నా ట్రాక్టర్లోనే అక్కడికి వెళ్ళారు.
పోలీస్ బందోబస్తు ఉందని నా ట్రాక్టర్లో ఎక్కి పొలాల నుండి బాసర ట్రిపుల్ ఐటీకి నేను మిమ్మల్ని తీసుకెళ్లా.. నాకు కూడా రుణమాఫీ చేయరా అంటూ రైతు సిరాజీ వేడుకున్నాడు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన చేస్తుంటే… వారికి మద్దతుగా అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో క్యాంపస్ లోకి ఎవరూ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా… ఓ దశలో ట్రాక్టర్ పై వెళ్లి… నడుచుకుంటూ క్యాంపస్ లోపలికి చేరుకున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డిని ట్రాక్టర్ లో తీసుకెళ్లింది షిండే సిరాజ్ కావడం గమనార్హం.