హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే పలు ప్రదేశాల్లో జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అతని తమ్ముడు శిరీష్, కుమార్తె హన్సిత రెడ్డిలకు సంబంధించి ఎనిమిది నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లో ఏక కాలంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పుష్ప నిర్మాతలైన మైత్రీమూవీస్ అధినేతలు యర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగో మీడియా కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు 200 మంది ఐటీ సిబ్బంది 55 బృందాలుగా ఏర్పడి ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 గతేడాది డిసెంబర్ 5న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1850 కోట్లు వసూళ్ళు చేసిందని సినీ పరిశ్రమలో టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్ధ భాగస్వాముల ఇళ్ళపై ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సంక్రాంతికి దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు కూడా బాగా వసూళ్ళు రాబట్టాయిని ఆ సినిమాల నిర్మాతలే ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పారు. ఈ నేపథ్యంలో వీరందరి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని పూజా విల్లాస్తో పాటు బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.