27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

రాజ్యసభకు లింగమనేని రమేష్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేనలు మంచి అవగాహనతో ముందుకు వెళుతున్నాయి. ఏపీలో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమి ఖాతాలోనే పడుతుంది. విపక్ష వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో ఇటు ఎమ్మెల్సీ, అటు రాజ్యసభ స్థానాలు దక్కే ఛాన్స్ లేదు. వచ్చిన వన్నీ కూటమి ఖాతాలోనే పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు టీడీపీ, బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. వైసీపీ నుంచి రాజీనామా చేసిన నలుగురు రాజ్యసభ పదవుల్లో రెండింటిలో తెలుగుదేశం పార్టీ, రెండింటిలో బీజేపీ దక్కించుకుంది. రాజ్యసభ స్థానాలు మాత్రం జనసేకు దక్కలేదు. అందుకే ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానంలో ఒకటి జనసేన ఖాతాలో పడనుంది.

జనసేనకు ఇప్పటి వరకూ రాజ్యసభలో సభ్యులు లేరు. పార్లమెంటులో ప్రాధాన్యత ఉంది కానీ, రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఖాళీ అవుతున్న స్థానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్నేశారని చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అదానీ సన్నిహితుడు పరిమళ్ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ ల రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో పరిమళ్ నత్వాన్ని స్థానంలో ఖాళీ అయ్యే రాజ్యసభ పదవిని బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు. సానా సతీష్ కు తక్కువ కాలమే రాజ్యసభ పదవి ఉండటంతో ఆయనకు టీడీపీ నుంచి రెన్యువల్ చేసే అవకాశముంది. మరొక స్థానం మాత్రం టీడీపీ, బీజేపీలు తీసుకుని ఒకటి మాత్రం జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు.

జనసేనకు కేటాయించిన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు ఇవ్వాలని ముందుగానే డిసైడ్ అయినట్లు తెలిసింది. లింగమనేని రమేష్ ఇటు చంద్రబాబుకు, అటు పవన్ కల్యాణ్ కు సన్నిహితుడు కావడంతో ఆయనకు జనసేన నుంచి రాజ్యసభ పదవి ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల ముందు కూటమి ఏర్పాటులో కూడా లింగమనేని రమేష్ కీలకంగా వ్యవహరించారు. లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు ఉంటున్నారు.

టిడిపితో జనసేన జట్టు కట్టిన నాటి నుంచి లింగమనేని రమేష్ జనసేన కార్యక్రమాలకు ఆర్థికంగా సహకరిస్తున్నారని వినికిడి. టిడిపి ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోందని, జనసేన కోటాలో ఇచ్చినా లింగమనేని… చంద్రబాబు మాట జవదాటరని పేరుంది. పవన్ కల్యాణ్ కు కూడా సన్నిహితుడిగా ఉండటంతో ఆయనకు పదవి ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. అందుకే తన సోదరుడు నాగబాబును రాజ్యసభ పదవికి ఎంపిక చేయాలనుకుని తొలుత భావించినా లింగమనేని రమేష్ కు ఈ స్థానం రిజర్వ్ అవ్వడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద లింగమనేనిని రాజ్యసభకు పంపాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com