- మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన సిట్
- అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపిన సిట్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధనుంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు అలాగే కృష్ణమోహన్రెడ్డి సీయం ఓఎస్డీగా పనిచేశారు. వీరిద్దపై మద్యం కుంభకోణం కేసులో ఏ31, ఏ32లు అభియోగాలు మోపింది సిట్. గడచిన రెండు రోజులుగా సిట్ విచాణకు హాజరవుతున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వీరిద్దరినీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి సియంఓ కేంద్రంగా కీలకంగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు చెపుతున్నారు. గురువారం దాదాపు 13 గంటల పాటు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ విచారించింది. సిట్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ.రాజశేఖరబాబుతో పాటు పలువురు అధికారులు వీరిద్దరినీ విడివిడిగా విచారించారు.
ఇది మంచి సాంప్రదాయం కాదు… బొత్స
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులను ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు వర్గ రాజకీయాలు సంస్థలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. మద్యం కేసులో అరెస్టులు ఎటువంటి ఆధారాలు లేకుండా జరుగుతున్నాయని ఆరోపించారు. బెదిరించి బలవంతంగా తప్పుడు సాక్ష్యాలు రాబట్టుకుంటున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర బాబు తీసుకువచ్చిన ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు మరియు తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని ఆయన బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.