హైదరాబాద్ మాదాపూర్లోని నేమాని మీడియా హౌజ్, భాస్కర న్యూస్ ఆఫీస్ను ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు శుక్రవారం సందర్శించారు. మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు.. ఇటీవలే నూతనంగా ప్రారంభించిన నేమాని మీడియా హౌజ్, భాస్కర న్యూస్ కార్యాలయానికి విచ్చేశారు. తమ మీడియా హౌజ్ను సందర్శించిన మంత్రి శ్రీధర్బాబుకు నేమాని మీడియా హౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ నేమాని భాస్కర్ సాదరంగా స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా శాలువా కప్పి, పూలబోకే అందజేశారు. ఈ సందర్భంగా నేమాని మీడియా హౌజ్ పనితీరును, వార్తా కథనాల శైలిని అడిగి తెలుసుకున్నారు. జర్నలిజంలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన నేమాని భాస్కర్.. స్యయంగా మీడియా హౌజ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు శ్రీధర్బాబు. నేమాని వంటి అనుభవజ్ఞులు స్టార్టప్ ద్వారా జర్నలిస్టులకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. మీడియా రంగంలో నేమాని భాస్కర్ దశాబ్దాలుగా చేస్తున్న సేవలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా..అన్ని వర్గాల నుంచి ఉన్నతమైన పేరు సంపాదించారని, ఆ గుర్తింపే నేమాని మీడియా హౌజ్ దిన దిన ప్రవర్థమానంగా ఎదిగేందుకు దోహదపడుతుందని శ్రీధర్బాబు ఆకాంక్షించారు. భాస్కర న్యూస్ సిబ్బందిని పేరుపేరునా పలకరించిన శ్రీధర్బాబు.. సంస్థ పురోగతిలో అందరూ పాలు పంచుకోవాలని సూచించారు. ఈసందర్భంగా నేమాని మీడియా హౌస్ పనితీరును ఎండీ నేమాని భాస్కర్ మంత్రి శ్రీధర్బాబుకు వివరించారు. నేమాని మీడియా హౌస్ను మంత్రి శ్రీధర్బాబు సందర్శించిన సమయంలో ధాత్రి కమ్యూనికేషన్స్ ఎండీ పమిడికాల్వ మధుసూదన్, ఐటీ, రోబోటిక్స్ సర్వీసెస్ సంస్థ ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధులు రాధాకిషోర్, వెంకట్ తదితరులు ఉన్నారు.