దేశమంతా ఏలుతున్నా.. హస్తినగడ్డపై ఇంత వరకు కాషాయ జెండా ఎగరడం లేదన్నది బీజేపీ నేతలకు ఓ తీరని లోటుగా మారింది. అయితే లెటెస్ట్గా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ఆ లోటు తీరబోతున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ గడ్డపై రెపరెపలాడేది కాషాయ జెండే అని తేల్చి చెబుతున్నాయి. నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్ గెలుస్తుందా? లేక ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం చూస్తున్న బీజేపీ ఎదురుచూపులు ఫలిస్తాయా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరగబోతోంది. అంతకంటే ముందుగా.. ఎగ్జిట్ పోల్స్ రూపంలో రిజల్ట్స్ పై కొంత క్లారిఫికేషన్ ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకే పవనాలు అనుకూలంగా వీస్తున్నాయని చెబుతున్నాయి. ఢిల్లీ ఎగ్జిట్పోల్స్ ప్రకారం.. బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కన్పిస్తోంది. 25 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి.
ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుందన్న భావన కన్పిస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు దక్కాలి. ఒకటి, రెండు సర్వేలు మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ హస్తినగడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, JVC పోల్, పీ మార్క్, టైమ్స్ నౌ, చాణక్య.. ఇలా అనేక సర్వే సంస్థలు బీజేపీదే గెలుపు అని చెబుతున్నాయి. కేకే సర్వే మాత్రం ఆప్దే మరోసారి అధికారమని ఘంటాపథంగా చెబుతుంది.
నిజానికి అధికారాన్ని మరోసారి నిలుపుకొనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి హామీల డోస్ను భారీగా పెంచింది. ఢిల్లీలో 26 ఏళ్లుగా అధికారం మొఖం చూడని కమలం పార్టీ ప్రచారం చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలు నిర్వహించింది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినా ఢిల్లీ అసెంబ్లీలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నామన్న ఆలోచన బీజేపీలో కనిపించింది. అందుకే ఈసారి ఢిల్లీ పీఠం ఎక్కాల్సిందేనన్న కసి కాషాయదళంలో పెరిగింది. కేజ్రీవాల్ టార్గెట్ గా ప్రధాని మోడీ దగ్గర్నుంచి కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల దాకా ప్రచారాన్ని హోరెత్తించారు.
అటు 2013కు ముందు ఏకంగా పదిహేనేళ్ల పాటు హస్తినలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ మరోసారి పగ్గాల కోసం గట్టిగానే పోరాడింది. అయితే 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఈ సారి కూడా ఖాతా తెరిచే అవకాశాలు లేవని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. మరి మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోరాటం ముగిసి ప్రజా తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.