- ఇండస్ బేసిన్ లో ప్రాజెక్టులు కడితేనే సాధ్యం
- ఇప్పటికి కిషన్ గంగా,పాకాల్ దాల్, నీమూ బాజో డ్యామ్ లు పూర్తి
- వేధిస్తున్న నిధుల కొరత, పర్యావరణ క్లియరెన్స్
- కొండ ప్రాంతాల్లో నిర్మాణానికి అడ్డంకులెన్నో..
- కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి 5,10 ఏళ్ల టైమ్ పట్టే ఛాన్స్
- కానీ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగచ్చు
- వియన్నా ఒడంబడికలో ఆర్టికల్ 60 అదే చెబుతోంది
- స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహంతో భారత్
- ఒప్పందంపై ఏకపక్ష సవరణలకూ ఛాన్స్
- పాక్ కు 25 శాతం జీడీపీ సమకూరుస్తున్న జలవనరులు
- 80 శాతం వనరులు వాడుకుంటున్న పాక్
- 40 శాతం కూడా వినియోగించని భారత్
- డ్యామ్ లు కడితేనే మేలంటున్న నిపుణులు
పెహల్గాం దాడికి నిరసనగా ఇండస్ జలవనరులను నిలిపివేస్తామని భారత్ హెచ్చరించింది.ఉగ్రవాదాన్ని సమర్ధిస్తూ ఉల్టా మనపైనే ఆరోపణలు చేస్తూ బుకాయిస్తున్న పాకిస్థాన్ను మందలించే ఉద్దేశంతో మనం చేసిన హెచ్చరికలకు పాకిస్థాన్ తీవ్రమైన భాషలో రెచ్చిపోయింది. కంటికి కన్ను,పంటికి పన్ను అంటూ నానా యాగీ చేస్తోంది. తమ దేశానికి నీటిని ఆపడమంటే అది యుద్ధానికి దారితీసే చర్యేనంటూ హూంకరించింది. దెబ్బకు దెబ్బ తీస్తామని ఇండస్ జలాలను ఆపితే మేం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ చెలరేగిపోతోంది. సరిహద్దుల దగ్గర దళాలను మోహరిస్తోంది. భారత్ ఉగ్రదాడులను ప్రేరేపిస్తూ తమపై అభాండాలు వేస్తోందని శుద్ధ అబద్ధాలు చెబుతోంది.
నిజానికి ఇండస్ వాటర్ ట్రిటీ రద్దుపై భారత్ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. నిర్ణయం తీసుకున్నా ఇప్పటి కిప్పుడు దానిని రాత్రికి రాత్రే అమలు జరిపే అవకాశమైతే లేదు.నదీ జలాల ఒప్పందాలన్నీ ఒక అంతర్జాతీయ ఒడంబడిక ద్వారా కుదిరేవే.
అసలు ఇండస్ నదీ జలాలు అంటే…
సింధు నదీ జలాలలో మొత్తం ఆరు నదులు ఉన్నాయి.వీటిలో మూడు నదులు తూర్పుకు, మరో మూడు నదులు పడమరకు ప్రవహిస్తున్నాయి.వీటిలో తూర్పు దిశగా ప్రవహించే రావీ, బియాస్, సట్లెజ్ నదుల నీటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకునేలా పడమటకు ప్రవహించే జీలం, చెనాబ్,సింధు నదుల నీటిలో 80 శాతం పాకిస్థాన్ వాడుకోవచ్చని ప్రపంచబ్యాంకు సమక్షంలో ఒప్పందం కుదిరింది. మన పరిధిలో ఉన్న నదులపై హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఇతర మౌలికవనరుల ప్రాజెక్టులు నిర్మించడంపై గతంలో పాకిస్థాన్ అభ్యంతరాలు తెలిపింది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని యాగీ చేసింది. ఇండస్ బేసిన్ జలాల వల్లనే పాకిస్థాన్ లో 80 శాతం వ్యవసాయం, హైడ్రోపవర్ అవసరాలు తీరుతున్నాయి. అయితే వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ అవసరాలు పెరుగుతున్నందున వాతావరణ మార్పిడులకనుగుణంగా ఈఈ ఇండస్ వాటర్ ట్రిటీ ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ వాదిస్తోంది.
సాధ్యమయ్యేదేనా?
పెహల్గాం దాడి నేపధ్యంలో పాకిస్థాన్ పై వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు మన దేశం సింధు నదీ జలాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. వాస్తవానికి ఇది అంత సులభం కాదన్నది నిపుణులు చెబుతున్నమాట. పడమటన ప్రవహించే నదుల నీటి ప్రవాహాన్ని కొన్ని సీజన్ లలో తట్టుకోవడం కష్టమన్నది నిజం.. కోట్ల క్యూబిక్ మీటర్ల నదీ జలాల ఉథృతిని నియంత్రించడం, వాటిని నిల్వ చేయడం, దారి మళ్లించడం అంత సులభం కాదు. నీటిని మళ్ళించాలన్నా డైవర్షన్ కెనాల్స్ నిర్మించాలి. ఆ నీటిని నిల్వ చేయాలన్నా అందుకు తగిన డ్యామ్ లు నిర్మించాలి. మనకున్న మౌలిక సదుపాయం కేవలం హైడ్రో పవర్ ప్లాంట్ నిర్వహణకు మాత్రమే సరిపోతుంది.
మౌలిక వనరుల కొరత
హైడ్రో వపర్ ప్రాజెక్టుల్లో కిందకి వృథాగా పారే నీటిని టర్బైన్లతో తిప్పుతూ విద్యుత్ ను తయారు చేస్తారు.దీనికి పెద్దగా నీటి నిల్వల అవసరం ఉండదు. మన దేశంలో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో జీలం, చెనాబ్, ఇండస్ నదులనుంచి వృథాగా కిందకు పారే నీటిలో ఒప్పందం ప్రకారం 20 శాతం కూడా మనం పూర్తిగా వినియోగించుకోవడం లేదు. మన వాటా నీటిని మనం పూర్తిగా వినియోగించుకోవాలంటే స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం జరగాలి. అయితే ఈ ట్యాంకుల నిర్మాణాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది నిబంధనల ఉల్లంఘనేనని గావు కేకలు పెడుతోంది.
అయితే పాకిస్థాన్ అనుమతి అవసరం లేకుడానే ప్రస్తుత మౌలిక సదుపాయాలను మార్చుకోవచ్చని, లేదా కొత్త స్టోరేజ్ ట్యాంకులు నిర్మించుకోవచ్చని మన నిపుణులు అంటున్నారు. గతంలో మాదిరిగా భారత్ తన ప్రాజెక్టు డాక్యుమెంట్ల వివరాలను పాకిస్థాన్ కు అప్పగించాల్సిన అవసరం కూడా లేదు.
మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణానికి భౌగోళిక అడ్డంకులతో పాటు మనదేశంలోనే నిరసనలు రేగడం వల్ల ఇండస్ రివర్ ప్రాజెక్టులు కూడా వేగంగా ముందుకు కదలలేదు.2016లో భారత నియంత్రిత కశ్మీర్ పరిధిలో ఉగ్రదాడులు జరిగిప్పుడు నదీ జలాల నిర్వహణాధికారులు ఇండస్ నదీ జలాలపై వేగంగా డ్యాములు, నీటి నిల్వ ప్రాజెక్టులు కట్టేస్తామని అన్నారు.
వేసవిలో అడ్డుకుంటే ఖతం..
అసలిప్పుడు భారత్ తన దగ్గరున్న మౌలిక వనరులతో నీటి లభ్యత తక్కువగా ఉండే పీక్ సమ్మర్ లో నియంత్రిస్తే పాకిస్థాన్ నీటి కోసం అల్లాడిపోవాల్సిందే. సాధారణంగా వేసవిలో ఇండస్ బేసిన్ లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుంది. ఆ టైమ్ లో అదను చూసి మనం మనప్రాజెక్టులు నింపుకుని నీటి నిల్వ చేసుకుంటే పాకిస్థాన్ కు తాగేందుకు కూడా మంచినీరు దొరికే వీలుండదు.
వాతావరణం, వర్షాలు, వరదలతో పాటు వ్యవసాయం, హైడ్రోపవర్ జనరేషన్, తాగునీటి అవసరాలను తీర్చుకోడానికి భారత్ పాకిస్థాన్ ఇండస్ జలాల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే తాజా పరిస్థితుల నేపధ్యంలో వరద సమాచారాన్ని పాకిస్థాన్ కు తెలియ చెప్పాల్సిన అవసరం లేదని ఇండస్ నదీజలాల కమిషనర్ గా వ్యవహరించిన నిపుణులు అంటున్నారు.సాధారణంగా వర్షాకాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఇండస్ బేసిన్ కి వరదలు వస్తుంటాయి. అయితే మామూలు టైమ్ లో కూడా ఇండస్ నదీజలాలకు సంబంధించి సరైన సమాచారం భారత్ ఇవ్వడం లేదని పాకిస్థాన్ ఆరోపిస్తూ వస్తోంది.
ఒప్పందం రద్దు సాధ్యమా?
పెహల్గాం దాడి నేపధ్యంలో దాయాది దేశం దూకుడు పోకడలకు నిరసనగా ఇండస్ వాటర్ ట్రిటీని నిలుపు చేస్తామని భారత్ ప్రకటించగానే పాకిస్థాన్ చెలరేగిపోయింది. అయితే ఇండస్ నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకునే అవకాశం మాత్రం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్ప, మధ్య,దీర్గ కాలిక ప్రాతిపదికన ఈజలాల ప్రవాహాన్ని అడ్డుకోవాలని కేంద్ర కేబినెట్ ఆలోచిస్తోంది. సింధు నదీ పరివాహక ప్రాంతంలో మన డ్యామ్ ల కెపాసిటీని పెంచుకోవడం. మరిన్ని డ్యామ్ లు నిర్మించుకోవడం. దీనిపై మనం పాకిస్థాన్ కు సమాచారం ఇవ్వాలసిన అవసరం కూడా లేదు. మన జనాభా అవసరాలకు, ఇంధన అవసరాలకు తగిన విధంగా ఈ ఒప్పందాన్ని మార్చాలని మనం చేస్తున్న ఒత్తిళ్లకు పాక్ స్పందించడం లేదు. పైగా మనకెలాంటి మార్చే అధికారాలు లేవని బుకాయిస్తోంది.
అయతే మనకో ఆప్షన్ ఉంది. ఇండస్ వాటర్ ట్రిటీ నుంచి మనం ఏకపక్షంగా బయటకు వచ్చే వీలుంది. వియన్నా ఒడంబడిక లోని ఆర్టికల్ 60 ప్రకారం పొరుగు దేశం ఉల్లంఘనలకు పాల్పడితే ఈఒప్పందంనుంచి ఏకపక్షంగా బయట పడిపోవచ్చు.లేదా దీన్ని సవరించడానికి పూర్తి అధికారాలు భారత్ కు ఉన్నాయి. సింధు జలవనరులపై మనం కట్టాలనుకున్న ప్రాజెక్టులు కట్టేందుకు కనీసం 5నుంచి పదేళ్లు టైమ్ పడుతుంది. నిధుల సమీకరణ, పర్యావరణ క్లియరెన్సులు అన్నీ దాటుకు ముందుకెళ్లాలి. పైగా హిమాలయ పర్వత సానువుల్లో డ్యామ్ ల నిర్మాణం రిస్కుతో కూడుకున్నది. కొండల మధ్య ఇప్పటికే మనం కిషన్ గంగా, పాకాల్ దాల్, నీమూ బాజో అనే డ్యాములు నిర్మించాము.ఎగువ దేశంగా సింధు జలవనరులపై నియంత్రణాధికారాలు మనవే. వర్షాకాలంలో నీటిని వదిలేయడమేకాదు, వేసవి కాలంలో అవసరమైతే మనం పూర్తిగా వాడుకునే హక్కులూ కలిగి ఉన్నాము. కాబట్టి భారత్ ముందు ముందు ఈ వివాదాస్పద జల ఒడంబడికపై మరింత పట్టు బిగించే అవకాశముంది.పాకిస్థాన్ జీడీపీలో 25 శాతం ఈ జలవనరులపై ఆధారపడి ఉన్న నేపధ్యంలో మనం దీర్ఘకాలంలో డ్యామ్లను నిర్మించుకుంటే ఆ నదీ జలాలపై పట్టు బిగించి పాకిస్థాన్ ను ఒక ఆట ఆడించవచ్చు. అదే టైమ్ లో మన ఇంధనావసరాలు, వ్యవసాయ జల అవసరాలు తీర్చుకోవచ్చు.