బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి సోమవారం ఢాకాకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు, మైనారిటీలపై జరుగుతున్న హింస, ఆలయాలపై దాడులను ప్రస్తావించే అవకాశం ఉంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. మైనారిటీలపై దాడుల విషయంలో భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. వారికి రక్షణ కల్పించాలని బంగ్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
దేశ ద్రోహం ఆరోపణలపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడంపైనా భారత్ తన అందోళన తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి సమావేశంలో ఈ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కోల్కతాలోని బంగ్లా తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ షిక్దర్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్ను స్వదేశానికి బంగ్లాదేశ్ రప్పించినట్లు తెలుస్తోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి స్థాయి చర్చల్లో అష్రఫుల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తుర్కియే తయారుచేసిన బైరక్తార్ డ్రోన్లను మోహరించింది. దీంతో అప్రమత్తమైన భారత్ నిఘా పెంచింది.