- సిరియాలో ఉగ్రమూకల ఘర్షణ నేపధ్యంలో భారత్ వార్నింగ్
- వెంటనే స్వదేశం రావాలని సిరియాలో ఉన్న భారతీయులకు పిలుపు
సిరియాలో యుద్ధ వాతావరణం నేపధ్యంలో భారతీయులెవరూ ఆ దేశానికి ప్రయణాలు చేయవద్దని మనవిదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.తదుపరి గైడ్ లైన్స్ ఇచ్చే వరకూఆ దేశానికి ప్రయాణాలు చేయవద్దని ఆ శాఖ స్పష్టం చేసింది. అలాగే సిరియాలో ఉన్న భారతీయులు రక్షణ చర్యలు పాటించాలని సేఫ్టీ షెల్టర్లలోనే ఉండాలని, బయట తిరగొద్దని సూచనలు చేసింది. సిరియాలో ఉన్న వారు అందుబాటులో ఉన్న కమర్షయల్ ఫ్లైట్స్ సాయంతో స్వదేశం రావాలని కూడా భారతవిదేశాంగ శాఖ సూచించింది.డమాస్కస్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు అందుబాటులో ఉంటుందని, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా (+ 963993395973 ( వాట్సప్ కూడా ఉంది)
అందుబాటులో ఉంచినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అరబ్ రిపబ్లిక్ లో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత్ ప్రకటించింది. సిరియాకు చెందిన ఇస్లామిక్ గ్రూప్ దేశాధ్యక్షుని ఆర్మీపై కాల్పులకు పాల్పడటంతో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత వారం రోజుల నుంచి ఇస్లామిస్ట్ గ్రూప్ స్రుష్టిస్తున్న హింసాకాండను అధ్యక్షుని బలగాలు సమర్దంగా తిప్పి కొట్టలేకపోయాయి. దాంతో 14 ఏళ్ల అంతర్యుద్ధం మరోసారి బహిర్గతమైంది.హమా భూభాగంపై పట్టు కోల్పోయామని ఆర్మీ తొలిసారి ప్రకటించింది. ఉగ్రవాద గ్రూపులు హమా ను చుట్టుముట్టాయని, ముప్పేట దాడి చేయడంతో దానిని ఎదుర్కొనలేకపోయామని ఆర్మీ అంగీకరించింది. నగరంలోకి అనేక మార్గాల ద్వారా ఉగ్రవాద మూకలు ప్రవేశించాయని సిరియన్ ఆర్మీ ప్రకటించింది. చొరబాటు దారులు రెండు నగరాలను ఆక్రమించడంతో ప్రజలు భయంతో ఇళ్ళు వదలి పారిపోతున్నారు.గతవారం తీవ్రవాదులు సిరియాలోని రెండో నగరమైన అలెప్పోను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.నలుమూలలనుంచి పట్టణాలను చుట్టుముట్టి అష్ట దిగ్బంధనం చేసి కాల్పులు జరుపుకుంటూ లోనికి ప్రవేశించడంతో ఆర్మీ తెల్లమొఖం వేయాల్సి వచ్చింది.