పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పై అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా డిజిటల్ స్ట్రైక్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిసరనగా పాక్ దౌత్య సంబంధాలను విశేషంగా తగ్గించడంతో పాటు సింధూ నదీ జలలా ఒప్పందం సస్పెన్షన్, పాకిస్తాన్ పౌరుల వీసాల రద్దు తదితర ఐదు రకాల ఆంక్షలను భారత్ ఇప్పటికే విధించింది. తాజాగా పాకిస్తాన్ కు చెందిన 16 పాపులర్ యూట్యూబ్ ఛానళ్ళలను డిజిటల్ స్ట్రైక్ పేరుతో భారతదేశంలో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పదహారు యూట్యూబ్ ఛానళ్ళలో ఒకటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కి చెందిన ఛానల్ కూడా ఉన్నట్లు సమాచారం. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న నేపథ్యంలో డిజిటల్ స్ట్రైక్ పేరుతో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నిషేధించిన వాటిలో పాకిస్తాన్ కి చెందిన న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ విభాగాలకు చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్న జియో న్యూస్, సామా టీవీ, డాన్ న్యూస్, జీఎన్ఎన్, అరె న్యూస్, బోల్ న్యూస్ తదితర పాపులర్ యూట్యూబ్ చానళ్ళు భారత్ నిషేధించిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు కొంత మంది జర్నలిస్టుల ఖాతాలను కూడా నిషేధించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా నడిచే ఈ యూ ట్యూబ్ ఛానళ్ళు అన్నీ భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతవిధ్వేషాలు సృష్టించే కంటెంట్ కూడిన వీడియోలు ప్రసారం చేస్తున్నాయని అందుకే వీటిని నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్ధ బీబీసీకి కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మీరు ప్రసారం చేస్తున్న వార్తల సరళని మార్చుకోవాలని ఆలేఖలో బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్కి లేఖ రాశారు. ప్రధానంగా పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మీరు చేస్తున్న రిపోర్టింగ్ లో ఉగ్రవాదులను తీవ్రవాదులగా పేర్కొంటున్నారని, మీ రిపోర్టింగ్ విధానం భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, ఇకపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ మీరు ప్రసారం చేస్తున్న వార్తలను పర్యవేక్షిస్తుందని బీబీసీని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.