గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సరస్సులు, నీటి వనరులు, నాలాలను ఆక్రమణల నుంచి రక్షించడానికి మాత్రమే హైడ్రా స్థాపించామని, హైడ్రా కార్యకలాపాలు రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపంచలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనకు మంత్రి పై విధంగా జవాబు ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో ఆక్రమణలకు సంబంధించి 9078 ఫిర్యాదులు అందితే అందులో 7249 ఫిర్యాదులకు పరిష్కారం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. భూ సంబంధిత ఫిర్యాదులు చేయడానికి ప్రతిరోజు వందలాది మంది హైడ్రా కార్యాలయానికి వస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరాన్ని ప్రపంచ స్ధాయి నగరంగా మార్చే లక్ష్యంతో మెగా మాస్టార్ ప్లాన్-2050 ముసాయిదాను మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో ప్రకటించారు. ఈ ప్రణాళిక నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ చైతన్యం, స్ధిరత్వం, ఆర్థిక వృద్ధిపై దృష్టి పెడుతుందని మంత్రి తెలిపారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబందించి ఏ భాగం భూమిని కూడా స్వాధీనం చేసుకునే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నేను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలిద్దరం సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులమే అని ఈ విషయంపై హెచ్సీయు వీసి, రిజిస్ట్రార్లతో మాట్లామని చెప్పారు. సరస్సులు, రాతి నిర్మాణాలు వంటి కొన్ని ప్రాంతాలు యూనివర్శిటీకి చెందవని వారు ధృవీకరించినట్లు మంత్రి శ్రీధర్ బాబు సభముందు ఉంచారు.