- మిడిల్ క్లాస్ ప్రాధాన్యతతో ఈసారి బడ్జెట్
- వార్షికాదాయం రూ.12 లక్షల వరకూ నో టాక్స్
- ఈ విధానంతో ప్రజల సేవింగ్స్ పెరుగుతాయ్
- కొత్త శ్లాబుల ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సేవింగ్స్ కే
దేశానికి మధ్యతరగతి ప్రజలే వెన్నెముక అన్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్ ఈ మూడు ప్రధాన స్తంభాలతోనే వికసిత భారత్ వైపు దేశం అడుగులేస్తోందన్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో మధ్య తరగతికి వార్షిక పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచుతూ ఒక్కసారిగా దేశం ఆశ్చర్య పోయేలా చేశారామె. అయితే కొత్త పన్నుల విధానంలో ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచినా దానికి తగ్గట్లుగా సేవింగ్స్ పైనా ఆమె దృష్టి పెట్టారు. అదెలా అంటే మధ్య తరగతికి వార్షికాదాయం రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను ఉండదు. ఆపైన మాత్రం శ్లాబుల వారీగా వర్తిస్తుంది. అలాగే వేతన జీవులకు ఏడాదికి రూ.12.75 లక్షల వరకూ ఎలాంటి పన్ను వసూలు చేయబోమని తెలిపారు. అయితే 12 లక్షల వార్షికాదాయం కలిగిన వ్యక్తి కి కొత్త చట్టం ప్రకారం పన్ను మినహాయింపు(క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం మినహాయించి) పొందాలంటే అందులో కనీసం రూ.80 వేల రూపాయలు సేవింగ్స్ రూపంలో దాచుకునే వెసులు బాటు ఇచ్చారు. ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే ఈ మొత్తం పన్ను పరిధిలోకి రావాలి. కాబట్టి ఆ వ్యక్తి రూ.80 వేల ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందినట్లన్న మాట.
అలాగే వార్షికాదాయం రూ.18 లక్షలు ఉన్న వ్యక్తులయితే వారికి రూ.70 వేల రూపాయల పన్ను సేవ్ అయినట్లన్న మాట. కొత్త పన్నుల విధానం ప్రకారం అది టాక్సబుల్ ఇన్ కమ్ అవుతుంది.
ఇక వార్షికాదాయం రూ.25 లక్షలున్నవారికైతే లక్షా పదివేల రూపాయలు పన్ను నుంచి మినహాయింపు పొందినట్లు. ఎందుకంటే కొత్త పన్నుల విధానం ప్రకారం అయితే ఇందులో 25 శాతం పేబుల్ టాక్స్ పరిధిలోకి వస్తుంది.
దేశానికి వెన్నెముక అయిన మధ్య తరగతి వర్గమే జాతి నిర్మాణంలో కీలకమని,అందుకే వారి సంక్షేమమే ధ్యేయంగా ఈసారి బడ్జెట్ ను రూపొందించామని, వారిపై పన్నుల భారాన్ని తగ్గించి మరింత పొదుపు చేసుకునేందుకు ఊతం కల్పించామని అన్నారు ఆర్థిక మంత్రి.