ఆపరేషన్ టైమ్ లోనూ దేశం గురించే…
మన్మోహన్ కు 2009లో క్రిటికల్ కరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనది. దాదాపు పది నుంచి 11 గంటల సమయం పట్టింది. ఆపరేషన్ పూర్తయి శ్వాస కోస గొట్టం కూడా తీశాక ఆయన కళ్లు తెరచి అడిగిన మొదటి ప్రశ్న నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది అని? ప్రధాని నోటి నుంచి ఇలాంటి ప్రశ్నలు రావడంతో డాక్టర్లు కూడా ఖిన్నులయ్యారు. ఆపరేషన్ ఎలా జరిగింది? అంతా బానే ఉందా అని అడుగుతారనుకున్నాం ఇలా అడిగారేంటి అని డాక్టర్ రమాకాంత పండా ఆయన్ను ప్రశ్నించారు. మీరు ఎలాగూ బాగానే చేస్తారని తెలుసు. నాకు సర్జరీమీద భయం కాదు.. దేశం గురించే అసలు భయం అన్నారట మన్మొహన్. ఆయన ప్రభుత్వం అప్పుటికి రెండో సారి గద్దె నెక్కింది. మన్మోహన్ కు ఆపరేషన్ జరుగుతున్న టైమ్ లో కశ్మీర్ లో ఉద్రిక్తతలు పెచ్చు మీరాయి. లోయ అంతా కల్లోలంగా మారింది.
సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు జరిగినప్పుడు పేషెంట్స్ తరచుగా ఛాతీ నొప్పితో మళ్లీ మళ్లీ ఆస్పత్రికి వస్తుంటారు. కానీ మన్మోహన్ ఒక్కసారి కూడా అలాంటి కంప్లయింట్ తో రాలేదు. ఆయన చాలా బలమైన, మంచి విల్ పవర్ ఉన్న మనిషి అన్నారాయన. రొటీన్ చెకప్ కు వచ్చిన ప్రతీసారి ఆస్పత్రి గేటు దగ్గరకి ఎదురేగి తాము ఆహ్వానించేవారమని, కానీ అలాంటి ఫార్మాలిటీలు వద్దని ఆయన వారించేవారని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి బలంగా నిలబడిపోతారని, క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ సొంతమని ఆయన గుర్తు చేసుకున్నారు.