– కాంగ్రెస్ లో చల్లారని ఎమ్మెల్యే మీటింగ్ వ్యవహారం
– తగ్గేదేలే అంటున్న అనిరుద్ రెడ్డి
– రంగంలోకి దిగిన అధిష్టానం
– మేము చూసుకుంటాము తొందర పడొద్దు అని హామీ
– ఖమ్మం జిల్లా మంత్రిపై ఫిర్యాదులు
– ఎమ్మెల్యేల మీటింగ్ వెనుక ఒక మంత్రి హస్తం
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న హడావిడిని తగ్గించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధిష్టానం తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎక్కడో కొంత గ్యాప్ ఉన్నట్లుగా అంగీకరించిన సీనియర్ నాయకులు.. భవిష్యత్తులో ఇలా జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వంలో గత వారం రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేలు తమకు అన్యాయం జరుగుతుందంటూ.. ముఖ్యంగా నిధుల కేటాయింపు కానీ, కాంటాక్టుల విషయంలో గానీ ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తున్నారు. వాళ్ల ఆరోపణలకు సంబంధించి వివరాలను సీనియర్లకు వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే అనిరుధ్ రెడ్డి బహిరంగంగానే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రిపై వ్యాఖ్యలు చేశారు. తానేదో పైరవీల కోసం ఇదంతా చేస్తున్నట్లుగా ఆ మంత్రి పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆయనతో పాటు.. మరో 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఇక ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకోవద్దని దీనిపై కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.తాము తగ్గేదే లేదని వీళ్లు.. పీసీసీ నాయకత్వానికి కూడా స్పష్టం చేయడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలకు మద్దతుగా ఒక మంత్రి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రిపై వ్యతిరేకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హడావుడి చేయడం వెనుక మరో మంత్రి ఉన్నట్టుగా కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అయితే, ఈ విషయంలో ఎమ్మెల్యేల వాదనలో కొంత వాస్తవం ఉండడంతో పొరపాట్లు జరిగాయని కేంద్ర నాయకత్వం దృష్టికి వెళ్ళింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన సదరు మంత్రిపై కొంతమంది సీనియర్లు కూడా ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది. సదరు మంత్రి తీరు వల్ల మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇబ్బందులు పడుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. మీ వ్యవహారం మరింత పెద్దది కాకుండా అధిష్టానం ఆల్ ఈజ్ వెల్ అనే సిద్ధాంతంతో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది.