- వీహెచ్పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్
- ట్రస్ట్ బోర్డులు రాజకీయ పునరావాసకేంద్రాలుగా మారాయి – గోకరాజు గంగరాజు
- దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులదే – గోవింద్దేవ్గిరీజీ మహారాజ్
ఆలయాలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ ఏంటని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ నిలదీశారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గన్నవరం సమాపంలోని కేసరపల్లి వద్ద జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు స్వచ్చందంగా తమ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి హిందూ సంఘాలకు అప్పచెప్పాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయాల నుంచి పొందుతున్న 12 శాతం ఆదాయాన్ని హిందువుల కోసమే ఖర్చు పెట్టాలన్నారు. స్వతంత్రానికి పూర్వం మన దేశంలో దేవాలయాలను విదేశీయులు తమ చేతుల్లోకి తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. వీహెచ్పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మానికి ఆలవాలమైన దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో గుడులపై జరుగుతున్నదాడులు ఆందోళన కలిగిస్తున్నాయని గంగరాజు ఆవేదనచెందారు. అన్యమతస్తులను పలు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమిస్తున్నారని వారిని తక్షణం తొలగించాలని గోకరాజు డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం ట్రస్ట్ కోశాధికారి గోవింద్దేవ్గిరీజీ మహారాజ్ మాట్లాడుతూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులందరిపై ఉందన్నారు. ప్రపంచం శాంతిభద్రతలతో ఉండాలంటే భారతదేశం సురక్షితంగా ఉండాలన్నారు. భవంతుడికి నివాసాలైన దేవాలయాలు సనాతన హైందవ సంస్కృతికి మూల స్తంభాలని గిరిజీ వ్యాఖ్యానించారు.