రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొనుగోళ్లలో కింగ్గా నిలుస్తోంది. టన్నుల కొద్దీ బంగారం నిల్వలున్న సంస్థగా ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందుతోంది. భారత కరెన్సీ, బ్యాంకుల నియంత్రణ సంస్థ ఆర్బీఐ చాలా కాలంగా బంగారం కొనుగోలు మొదలుపెట్టింది. అలా.. బంగారం కొంటూ కొంటూ.. పసిడి నిల్వలను అమాంతం పెంచుకుంటోంది. ఫలితంగా ఆర్బీఐ దగ్గరున్న బంగారం నిల్వలు భారీగా పెరిగాయి.
ప్రధానంగా ఈ ఆలోచన అమలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, ఆర్థిక భద్రతకు దోహదం చేస్తుంది. ఫలితంగా దేశంలో ఆర్థిక విధానాలను, జాతీయ భద్రతా అంశాలను కూడా ప్రభావితం చేసే కీలక అంశంగా బంగారం నిలుస్తోంది. ఈ పరిణామంతో బంగారం కేవలం ఆస్థిగానే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచే విలువైన సాధనంగా కూడా మారింది. అంతేకాదు.. విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పెరుగుతున్న కొద్దీ.. వీటి నిల్వలను పెంచుకుంటూ పోవడం వల్ల దేశ ఆర్థిక భద్రతను పెంచడం, ఆర్థిక వ్యవసస్థను మరింత సుస్థిరంగా తయారుచేయడానికి తోడ్పడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి చోటు చేసుకున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా మహమ్మారి చుట్టుముట్టినా, అనూహ్య పరిణమాలు ఏర్పడినా.. బంగారం విలువ మరింతగా పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
ఈయేడాది అక్టోబర్లోనే ఆర్బీఐ అత్యధికంగా 27 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ప్రపంచ గోల్డ్కౌన్సిల్ ఈ లెక్కలను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలా బంగారం నిల్వలు పెంచుకుంటున్నప్పటికీ అక్టోబర్లో మాత్రం రికార్డ్ సృష్టించింది. మరోవైపు.. ఈ ఒక్క యేడాది గడిచిన పది నెలల్లో ఏకంగా 77 టన్నుల బంగారం కొనుగోళ్లు చేసి రికార్డు సృష్టించింది ఆర్బీఐ.
మన దేశంలోని కేంద్ర బ్యాంకులన్నీ కలిపి అక్టోబర్లో 60 టన్నుల బంగారం కొనుగోలు చేశాయని, దానిలో అత్యధికంగా ఆర్బీఐ 27 టన్నుల బంగారం కొనుగోలు చేసిందని గోల్డ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టం చేసింది. అక్టోబర్లో బంగారం కొనుగోళ్లలో ఆ తర్వాత స్థానంలో టర్కీ 17 టన్నులు, పోలెండ్ 8 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. గడిచిన ఐదు నెలలుగా బంగారం విక్రయిస్తూ వస్తోన్న కజకిస్తాన్ కేంద్ర బ్యాంక్ కూడా అక్టోబర్లో బంగారం కొనుగోలు చేసిందని గోల్డ్ కౌన్సిల్ వివరించింది.
ఈ యేడాది లెక్కలు చూస్తే.. ఆయా దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులన్నీ 2024 సంవత్సరంలో అక్టోబర్ నెల నాటికి 694 టన్నుల బంగారం కొనుగోళ్లు చేశాయి. వాటిలో ఆర్బీఐ ఒక్కటే 77 టన్నుల బంగారం కొన్నది. అలాగే టర్కీ 72 టన్నులు, పోలండ్ 69 టన్నుల బంగారం కొన్నాయి.
ప్రైవేట్ బంగారం సరఫరా సంస్థలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ప్రముఖ నగదు నిల్వ కంపెనీల నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోళ్లన్నీ అంతర్జాతీయ మార్కెట్లలోనే జరుగుతాయి. ముఖ్యంగా లండన్, న్యూయార్క్ వంటి మార్కెట్లలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోల్డ్ ఫండ్ నుంచి ఆర్బీఐ బంగారం కొంటోంది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ బంగారం నిల్వలు కలిగిన సంస్థగా ఆర్బీఐ రికార్డ్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద మొత్తం 882 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటిలో 510 టన్నుల బంగారం నిల్వలు భారత్లో ఉన్నాయి. మిగతావి విదేశాల్లో ఉన్నాయి.