ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొన్న భూములు ఏ రైతుల నుంచి లాక్కున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. శుక్రవారం తునిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కాకినాడ సెజ్ లో తాను కొనుక్కొన్న భూముల విషయంలో మీడియలో వస్తున్న కధనాలపై మండిపడ్డారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇచ్చి కాకినాడ సెజ్ లో తాను భూములు కొనుక్కున్నాను తప్ప ఏ రైతు నుంచి బలవంతంగా లాక్కోలేదని రాజా తెలిపారు. వైఎస్సీర్సీపీలో ఉంటే భూములు కొనకూడదా అని మాజీ మంత్రి నిలదీశారు. కేవలం బురద చల్లడం కోసమే కొన్ని మీడియా సంస్ధలు నాపై ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నాయని అన్నారు.
యనమల ఎలా సంపాదించారు..?
గడచిన 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రెండు ఆస్తులు ఏ పేదల దగ్గర లాక్కున్నవో చెప్పాలని దాడిశెట్టి డిమాండ్ చేశారు. యనమల మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, కనీసం రెండు లక్షలు కూడా లేకపోతే, తుని ప్రముఖులు చందాలు వేసుకుని గెలిపించారని గుర్తు చేశారు. మరి అదే యనమలకి ఇప్పుడు డిస్టిలరీలు ఎలా వచ్చాయని, భూములు ఎలా కొన్నారని, అన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని నిలదీశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన యనమల, వాటిని ప్రజలకు పంచి పెట్టి.. ఆ తరువాత నీతులు చెబితే బాగుంటుందని సూచించారు. తునిలో తమది మొదటి నుంచి వ్యాపార కుటుంబం అని… అందరి లాగనే తామూ చట్టబద్దంగా భూములు కొంటే తప్పేంటని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.
రైతులను దోచేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోచుకు తింటోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమవడమే కాకుండా పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. అందుకే రైతులకు మద్ధతుగా వైయస్సార్సీపీ ఆందోళన చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో బస్తా ధాన్యం రూ.2200 నుంచి రూ.2400 ఉంటే, ఈరోజు అది రూ.1400కు పడిపోయిందని దాడిశెట్టి రాజా వివరించారు. ధాన్యం సేకరణ తమకు చేతకావడం లేదని సాక్షాత్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరే అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్.జగన్ ప్రకటించిన మద్ధతు ధరతో పాటు 2200 రూపాయలు చెల్లించాలని సవాల్ విసిరారు.