ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అదే ప్రచారం పెద్దయెత్తున జరిగింది. జనవరి 16వ తేదీన కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ అధికారుల విచారణ జరిపారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5.30 గటల వరకూ ఏకధాటిగా విచారణ జరిపారు. ఫార్ములా ఈ కారు రేసింగ్లో దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని కాంగ్రెస్ నేతలందరూ ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేసింగ్లో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండీఏ అధికారి బీఎస్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు.
ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అయితే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ను విచారించి మరోసారి విచారణకు పిలిచినప్పుడు రావాలని జనవరి 16వ తేదీన కోరారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేటీఆర్ను ఏసీబీ అధికారులు మళ్లీ పిలవలేదు. ఈ విషయంలో రాజకీయ మాటల యుద్ధం మాత్రం జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేసింగ్కు సంబంధించిన ఫైల్స్ ఈడీ అధికారులు పట్టుకుని వెళ్లారని, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అందుకే అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే, కేటీఆర్ను ఫార్ములా ఈ కారు రేసు కేసులో అదుపులోకి తీసుకోకపోవడానికి బలమైన కారణాలున్నాయని కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే మరోసారి ఏసీబీ నుంచి కేటీఆర్ కు పిలుపు రావడం ఖాయమని చెబుతున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయంటున్న కాంగ్రెస్ నేతలు.. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే సెంటిమెంట్తో బీజేపీ లబ్ది పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుందేమోనని కొంత వెనక్కు తగ్గారని సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి విచారణ ప్రారంభమవుతుందని అంటున్నారు.