నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మంగళవారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. ప్రత్యేక హెలీకాఫ్టర్ లో బెంగళూరు నుంచి ఉదయమే ఇడుపులపాయ చేరుకున్న వైఎస్.జగన్ తన తండ్రి, దివంగత మాజీ సీయం వైఎస్.రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ సమీపంలో ఉన్న నెమళ్ళ పార్క్ దగ్గర ఉన్న ప్రార్ధనా మందిరానికి వెళ్ళారు. తల్లి విజయమ్మ, భార్య భారతీరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలసి అక్కడ ప్రత్యేక ప్రార్ధనల్లో జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. ఇడుపులపాయలో ప్రార్ధనలు ముగించకుని అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కు చేరుకున్న జగన్మోహనరెడ్డి కడప జిల్లా నాయకులతో భేటీ అయి తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించారు. కడప నియోజకవర్గం నాయకులు, కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. చర్చల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీయం అంజాద్ భాషా, రాయచోటి మాజీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement with us -