కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టిఆర్ఎస్ నేతలకు పెరిగిన ధరల ప్రకారం బిల్లులు చెల్లించారని, రాష్ట్ర భవిష్యత్తుగా భావించే హాస్టల్ విద్యార్థులకు ఒక రూపాయి కూడా పెంచలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కఆరోపించారు. ఆస్తులు, అప్పులపై శాసనసభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
టీఆర్ఎస్ పాలనలో పేరుకుపోయిన బకాయిలు తీర్చేందుకు ప్రజా ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని భట్టి అన్నారు. వారు 40 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే 14 వేల కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకే ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. ప్రజాప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేయలేదని, ఎఫ్ ఆర్ బి ఎం పరిధిని తాము దాటలేదని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
30 సంవత్సరాలకు ఔటర్ రింగురోడ్డును టిఆర్ఎస్ పాలకులు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కూడా కమర్షియల్ ట్యాక్స్ వంటి వాటిని అదానీ, అంబానీకి ఇప్పుడే అమ్ముకుంటే వచ్చే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఎలా చేపడుతాయని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే హరీశ్ రావు అడ్డుతగిలే ప్రయత్నం చేయటంతో…హరీష్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదని… కేవలం రాజకీయం చేసే అలవాటు ఉందని విమర్శించారు. టిఆర్ఎస్ పాలనలో రూపొందించిన రూల్స్ బుక్కును వారే పాటించడం లేదని.. bac సమావేశంలో కాగితాలు పారేసి వెళ్లారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు.