భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఎనిమిదోసారి తిరస్కరించింది. నీరవ్ పరారయ్యే ప్రమాదం ఉందని, అలాగే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందన్న భావనకు బలమైన ఆధారాలున్నాయని కోర్టు తీర్పులో జస్టిస్ ఫోర్డ్హామ్ పేర్కొన్నారు. నీరవ్ మోదీ 2019 మార్చి నుంచి బ్రిటన్లో జైల్లోనే ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను బిలియన్ డాలర్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై అప్పగింత వారెంట్ ఆధారంగా ఆయనను అరెస్టు చేశారు.
నీరవ్ చాలా కాలంగా విచారణ ఖైదీగా ఉన్నారని, భారత్లోని ఇతర నిందితులకు బెయిల్ లభించిందని నీరవ్ తరఫు న్యాయవాది ఎడ్వర్డ్ ఫిట్జ్గెరాల్డ్ గుర్తు చేశారు. నీరవ్ పరారయ్యే అవకాశం లేదని, ఆస్తులన్నీ జప్తు చేసిన కారణంగా ఆయనకు ఆర్థిక వనరులు లేవని తెలిపారు. సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణ ఏడేళ్ల క్రిందటిదని, అప్పటి నుంచి జైలులో ఫోన్ సౌకర్యం ఉన్నా అలాంటి ఘటనలు పునరావృతం కాలేదని వివరించారు.
భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఫిట్జ్గెరాల్డ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ నుంచి భయపడి వేరే దేశానికి వెళ్లినా నీరవ్ మోదీ అక్కడ సురక్షితంగా ఉండలేరని తెలిపారు. క్రిస్టియన్ మిషెల్, జగ్తార్ జోహల్, లతీఫా కేసులు, అలాగే అమెరికా, కెనడాల్లో జరిగిన హత్యా ప్రయత్నాలు.. భారత ప్రభుత్వానికి ఉన్న అంతర్జాతీయ ప్రభావాన్ని సూచిస్తున్నాయన్నారు. ఆయన వనౌటు వంటి దేశానికి వెళ్లినా, భారత్ అక్కడ హంతక ముఠాను పంపించవచ్చునని, లేదా ఒత్తిడితో అప్పగించేలా చేయొచ్చన్నారు. మిషెల్ను ప్రైవేట్ జెట్లో బంధించి యూఏఈ నుంచి తీసుకొచ్చిన ఉదాహరణ, జోహల్ రోడ్డు మీద కిడ్నాప్ అయిన ఘటన, లతీఫాను భారత అధికారులు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వంటి న్యాయవ్యవస్థేతర చర్యలను ప్రస్తావించారు.
అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను ఖండించారు. “భారత ప్రభుత్వానికి నిజంగానే అంత శక్తి ఉంటే, యూకేలో ఉండగలిగే నీరవ్ను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు?” అని ఆయన న్యాయవాదిని ప్రశ్నించారు. ఫిట్జ్గెరాల్డ్ మరోవైపు, ఏప్రిల్ 2018లో ప్రారంభమైన రహస్య న్యాయపరమైన ప్రక్రియతో అప్పగింత ఆలస్యం అవుతోందని, ఆరేళ్లుగా జైల్లో ఉండటం అన్యాయమని అన్నారు.
భారత ప్రభుత్వం తరఫున వాదించిన నికోలస్ హియర్న్, నీరవ్కు వాస్తవంగా ప్రాణహాని ఉంటే, ఆయన స్వచ్ఛందంగా భారత్కు తిరిగి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. అక్కడి కోర్టు ఆర్డర్ను సీబీఐ ట్వీట్ చేసింది.