-
చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ
-
తెలంగాణ నుంచి హాజరైన అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు
-
కర్నాటక, కేరళ నుంచి ప్రతినిధులు
తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సమన్వయంతో నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరుగుతోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి హాజరయ్యారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. అంతేకాదు.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన 14 రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరంతా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి కలిగే నష్టాలపై చర్చలు ప్రారంభించారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపైనా పార్టీలన్నీ సమాలోచనలు చేస్తున్నాయి.
ఈ సమావేశంలో కేంద్రంపై పోరాటానికి ఓ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా దక్షిణాది నుంచి ఓ జేఏసీకి రూపకల్పన చేయనున్నారు. జేఏసీలో అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల నాయకులకు ప్రాతినిథ్యం ఉండేలా స్టాలిన్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.