తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం కానుంది. పోషకాహారం తో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు శనివారం నుంచి చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు క్యాబినెట్ సహచరులందరూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం కొత్త మెనూ ప్రకారం భోజనం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనున్నారు.
వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. చార్జీలు పెంచిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా నేడు విద్యార్థులతో యావత్ రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి భోజనం చేయనుంది. పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.