ప్రభుత్వ రంగంలో ఉన్న పోర్టును చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేశారు. గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో నిర్మించారని అది తొలుత ప్రభుత్వ రంగంలో ఉండేదని దాన్ని చంద్రబాబు ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. మలేషియా ప్రధానమంత్రి కుమారుడు కొంటున్నారనే ముసుగులో కాకినాడ పోర్టును కేవీరావుకు కట్టబెట్టారని పేర్కొన్నారు. దొడ్డిదారిన కేవీరావుని సీఎండీ స్ధానంలో కూర్చెబెట్టారన్నారు. చంద్రబాబు జేబు సంస్ధ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐతో కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహనరెడ్డిపై కక్షతీర్చుకోవాలనే పగతో చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 58 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు ఒక క్రిమినల్ అన్నారు. కేవీరావుకు అన్యాయం జరుగుతుంటే గడచిన నాలుగున్నరేళ్ళుగా ఏంచేస్తున్నాడని చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలు పాలు కావడం తధ్యమన్నారు. సింగపూర్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా బ్రోకర్ పనులు చేసే వ్యక్తి కేవీరావు.. 2020 మేనెలలో నేను కేవీరావుకి ఫోన్ చేసినట్లు కానీ కాకినాడ పోర్టు విషయం విక్రాంతతో మాట్లాడినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని విజయసాయి సవాల్ చేశారు. చంద్రబాబుకు పాలన చేతకావడం లేదు… లోకేష్ కు అడ్మినిస్ట్రేషన్ తెలియదు… తండ్రీ కొడుకులు ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
- Advertisement with us -