- వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన వైఎస్.జగన్
- వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి
రైతుల పట్ల ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అకాల వర్షాల కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా తాతిరెడ్డిపల్లిలో దెబ్బతిన్న అరటి తోటలను జగన్ సోమవారం పరిశీలించారు. ఈ పర్యటనలో పంట నష్టపోయిన రైతులతో జగన్ మాట్లాడారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి ఆపత్కాలంలో ప్రభుత్వం రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉచిత పంట భీమాను ఎత్తివేశారని, రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన చేసినట్లు జగన్ చెప్పారు. అకాల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని నెల క్రితం 26వేల ధర పలికితే ఇప్పుడు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల భీమా హక్కుగా ఉండేదని ఇప్పుడు దన్ని పూర్తిగా ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరటిసాగులో రాష్ట్రంలోనే పులివెందుల అగ్రస్ధానంలో ఉండేదని గుర్తు చేశారు. 25 కోట్ల రూపాయలతో మేము కట్టిన ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూటమి ప్రభుత్వం వాడుకోలేకపోతోందని విమర్శించారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని, వచ్చిన వెంటనే రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని వైఎస్.జగన్ రైతులకు హామీ ఇచ్చారు.