- కొత్త, పాత అందరూ ఘోర వైఫల్యం
- ఐదో టెస్ట్ లో టీమ్ ఇండియా ఓటమి
- 3-1 తో బీజీటీ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా
ఇప్పుడైనా ఆడతారు… ఈసారైనా ఆడతారని ఎదురుచుసిన అభిమానులకి ఎప్పటిలా నిరాశ తప్పలేదు. 5 టెస్ట్ మ్యాచులు, దాదాపు 10 ఇన్నింగ్స్…ఏ ఒక్కరూ కలిసికట్టుగా ఆడలేదు. ఇది టీమ్ గేమ్. కనీసం ఇద్దరైనా ఒక భారీ భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. ఒకరు ఆడితే మరొకరు 10 రన్స్ లోపే అయిపోతుంటే.. ఎవరు మాత్రం ఏం చేస్తారనే విమర్శలు వినిపించాయి.
యశస్వి రెండు టెస్టులు, కోహ్లీ ఒక టెస్ట్, రాహుల్ రెండు, పంత్ ఒకటి ఇలా మెరిపించారు. అయితే మన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ మాత్రం 4 టెస్టులు బాగా ఆడాడు. బౌలింగ్ లో బుమ్రాకి మ్యాన్ అఫ్ ది సిరీస్ వచ్చింది. ఇదొక్కటే ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. అయితే చివరి టెస్ట్ లో వెన్ను నొప్పితో బాధ పడ్డాడు. మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కోహ్లీ నాయకత్వంలో జట్టు పోరాడింది కానీ, లక్ష్యం 157 పరుగులే ఉండటంతో ఆస్ట్రేలియా 4 వికెట్లు పోయి అలవోకగా విజయం సాధించింది.
మొత్తానికి టీమ్ ఇండియా ఓటమితో జట్టులో ఏదో సంక్షోభం మొదలైందనే సంకేతాలు బయట ప్రపంచానికి వెళ్లాయి. ఇది కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగా వచ్చిందా? లేక రోహిత్ శర్మ అహంకారం వల్ల వచ్చిందా? అన్నది తేలాల్సి ఉంది.
గౌతమ్ గంభీర్ వచ్చాక టీమ్ లోకి యువతరం వచ్చింది. దేవదత్ పడిక్కల్, సర్పరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రజత్ పాటిదర్ ఇలా పలువురు వచ్చారు. కానీ ఎవరూ ఆకట్టుకోలేదు. కొందరు నిలకడ లేక, బోర్డుతో గొడవలతో ఇషాన్ కిషన్ శ్రేయాస్ అయ్యర్ లాంటి వాళ్ళు షేడ్ అవుట్ అయ్యారు. కాకపోతే గంభీర్ వచ్చి.. శ్రేయాస్ కి అవకాశాలు ఇచ్చినా తను నిలబెట్టుకోలేదు.
సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్లు అద్భుత ఫామ్ లో ఉన్నా, వాళ్లకి టెస్ట్ ఫార్మాట్ కి ప్రమోషన్ ఇవ్వకుండా ఆపారు. మరి ఆ పాపం ఎవరిదో కూడా తెలీదు.
ధోనీ శిష్యుడు అనే నెపంతో గౌతమ్ గంభీర్ అవకాశాలు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇక కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు… సీనియర్లు కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, గిల్, పంత్ ఇలా అందరూ ఫామ్ కోల్పోయి ఉన్నారు. దీంతో అటు కొత్త, ఇటు పాత అందరూ కలిసి టీమ్ ఇండియా వైఫల్యాలకు కారణమయ్యారు.
బౌలింగ్ లో బుమ్రా ఒక్కడే నిలిచాడు. సిరాజ్ చివర్లో లయ అందుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ద కృష్ణని బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఇది కోచ్ గంభీర్ వ్యూహత్మక తప్పిదమే అంటున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆకాశ దీప్ ని తప్పించి నాలుగో టెస్ట్ లో తీసుకొని ఉంటే, బుమ్రాకి వెన్ను నొప్పి తప్పేదనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.
కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు… మనవాళ్ళ ఆట పోవడానికి ఐపీఎల్ కూడా ఒక కారణం అంటున్నారు.