- శాంతి కుదర్చాల్సిన బాధ్యత మీదే
- మీ అండ లేకుండా యుద్ధం కొనసాగదు
- మాకు ఆయుధాలు లేవు.. ఆర్థిక స్థోమత అసలే లేదు
- ఇద్దరికీ సయోధ్య కుదర్చాల్సింది మీరే
- పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్ పై జెలన్ స్కీ ఆందోళన
- తమను నాటో నుంచి వెలివేయడంపై బాధ
- ట్రంప్ సడెన్ గా ప్లేట్ తిప్పేశారని భయం
- యుద్ధానికి ఎండ్ కార్డు వేయాల్సింది మీరే…
- మ్యూనిచ్ సదస్సు వేదికగా జెలన్ స్కీ అపీల్
మూడేళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లుగానే కనిపిస్తోంది. ఓపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ఈ విషయంలో చొరవ చూపడం,మరో వైపు జెలన్ స్కీ దగ్గర ఆయుధ నిల్వలు, ఆర్థిక పరిస్థితి కూడా నిండుకుంటూండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా మద్దతు కనక వెనక్కు తీసుకుంటే ఇక ఈ యుద్ధం కొనసాగించడం ఎంత మాత్రం తమ వల్ల కాదని శాంతి చర్చలతో వివాదాన్ని ఓ కొలిక్కి తేవాలని జెలన్ స్కీ కూడా కోరుకుంటున్నారు. మ్యూనిచ్ లో జరిగిన భద్రతా సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేన్ వాన్స్, జెలన్ స్కీ ఇద్దరూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాశ్వత శాంతి వాతావరణం ఏర్పడాలి. అయితే అది తూర్పు యూరప్ లో పరిస్థితి మాదిరి కాదు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి వాతావరణం ఎలా ఉండాలన్న అంశంపై రానున్న కాలంలో, వారాల్లో, నెలల్లో మరింత లోతుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతాయని వాన్స్ హామీ ఇచ్చారు. మరోవైపు ట్రంప్ హటాత్తుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి యుద్ధ విరమణ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇది జెలన్ స్కీని ఆందోళనకు గురి చేస్తోంది.
అమెరికాపై నమ్మకముంది…
అమెరికా ఉపాధ్యక్షుడు జే.డి. వాన్స్ తో తన భేటి ఇదే మొదటిదని, కానీ చివరిది కాదని ఇకపై దశల వారీగా చర్చలు జరుగుతాయని ఉక్రెయన్ అధ్యకుడు జెలన్ స్కీ అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పోయి ఖచ్చితంగా శాశ్వత శాంతి వాతావరణం సాధ్యమైనంత వేగంగా ఏర్పడాలని కోరుకుంటున్నాం అని జెలన్ స్కీ ఎక్స్ లో రాసుకొచ్చారు. త్వరలోనే వాషింగ్టన్ ప్రతినిధులు కీవ్ సందర్శిస్తారన్నారు. అమెరికా మద్దతు లేకుండా మేం ఇక మనుగడ సాధించలేం.ఇప్పటికే పోరాడి అలసిపోయాం.. మాదగ్గర ఆయుధాలు, ఆర్థిక స్థోమత పూర్తిగా అడుగంటిపోయాయి అన్నారు జెలన్ స్కీ ఓ మీడియా ఇంటర్వ్యూలో.మొన్నటి దాకా ట్రంప్ తనతో టచ్ లో ఉన్నారని, తన పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారని ప్రచారం చేసుకున్ జెలన్ స్కీ ట్రంప్, పుతిన్ తో ఫోన్ లో మాట్లాడటం చూసి కంగు తిన్నారు.
ఆ తర్వాతే పలాయనవాదం పఠించడం మొదలుపెట్టారు.
పుతిన్ ను నమ్మేదెలా?
రష్యా గత శుక్రవారం రాత్రి 133 ద్రోణులను ప్రయోగించిందని, అందులో దాడి జరిపే ద్రోన్ లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసిన రోజునే ఈ భద్రతా సదస్సు జరిగింది.రష్యా ప్రయోగించిన అటాక్ డ్రోన్స్ ఈశాన్య ప్రాంత పరిధిలోఉన్న చెర్నోబిల్ అణు రియాక్టర్ పరిధిలో సంచరించాయని జెలన్ స్కీ ఆరోపించారు. ఈ చర్యలు చూస్తే పుతిన్ శాంతి చర్చలు కోరుకుంటున్నారని, యుద్దానికి ముగింపు పలకాలనుకుంటున్నారని ఎవరూ నమ్మరని జెలన్ స్కీ అన్నారు. అయితే ఉక్రెయిన్ ఆరోపణలన్నీ పశ్చిమ దేశాలను నమ్మించి, భయపెట్టి ఆయుధాల సరఫరాసాగించుకోడానికేనని రష్యా తిప్పి కొట్టింది. ఈ పరిణామాల నేపధ్యంలో ట్రంప్ హటాత్తుగా పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడటం.. నాటోనుంచి ఉక్రెయిన్ ను వెలివేయడం చూస్తుంటే అమెరికా తమను నట్టేట ముంచి పోతోందన్న భయం ఉక్రెయిన్ అధినేతలో కలుగుతోంది.అయితే రష్యాను చర్చలకు కూర్చో బెట్టడమే అమెరికా ధ్యేయమని దీనికోసం అవసరమైతే దీనికోసం మిలటరీ ఆయుధాలను కూడా వినియోగించి బలవంతంగా శాంతి ఒప్పందం కుదిరేలా చేయాలని భావిస్తోంది.
కీలక సదస్సు…
మ్యూనిచ్ లో జరుగుతున్న 61వ భద్రతా సదస్సు రేపటితో ముగియనుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు పర్యావరణం, కాలుష్యం, క్లైమేట్ చేంజ్ లాంటి పరిణామాలతో తలెతతున్న భద్రతా పరమైన సవాళ్లపై మూడు రోజుల పాటు చర్చలు జరుగుతున్నాయి. ఇందులో 60 దేశాలకు చెందిన అధిపతులు, ప్రభుత్వాధికారులు, 150 మంది మంత్రులు,ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నేతలు, పాలసీ మేకర్లు, నిపుణులతో చర్చల జరిగాయి. ట్రంప్ రెండోసారి గెలుపు, ముంచుకు వస్తున్న జర్మనీ ఎన్నికలు, యూరోపియన్ కమిషన్ ఏర్పాటు నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సు చాలా కీలకమైనది. ట్రంప్ రాక తదితర పరిణామాల నేపధ్యంలో ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపైనా ఈసదస్సులో చర్చిస్తున్నారు.