హైదరాబాద్లో మరో డిజిటల్ అరెస్ట్ మోసం బయటపడింది. మల్కాజ్గిరికి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్ను భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.6 కోట్లకు పైగా వసూలు చేశారు.
‘డిజిటల్ అరెస్ట్’ పేరిట జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులమంటూ తనకు తాను పరిచయం చేసుకున్న ఓ సైబర్ కేటుగాడు మహిళా రిటైర్డ్ ప్రొఫెసర్కు వాట్సప్లో వీడియో కాల్ చేశాడు. ఆమెపై డ్రగ్స్, మనీలాండరింగ్, చీటింగ్ కేసులు నమోదయ్యాయని, ఆమె పేరు ఈడీ, సీబీఐ అనుమానితుల జాబితాలో ఉందని భయపెట్టాడు. సీబీఐ అధికారులు ఈ కేసును సీరియస్గా టేకప్ చేస్తున్నారని, మీకు సీబీఐ ఆఫీసర్లు కాల్ చేస్తారని కాల్ కట్ చేశాడు.
తరువాత కొద్ది సేపటికి మరొకడు.. తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకొని, ఈ కేసు కారణంగా ప్రొఫెసర్ పాస్పోర్ట్ రద్దయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చాడు. కేసు నుంచి ఆమె పేరు తీసేయాలంటే.. బ్యాంకు వివరాలు, ఆధార్, పాన్ కార్డ్ సమాచారం ఇవ్వాలని, అవన్నీ సరిపోలితే కేసులోంచి ఆమె పేరు తొలగిస్తామని ఓ సొల్యూషన్ చెప్పాడు. దీంతో, వాడిని నమ్మిన ఆ ప్రొఫెసర్.. ఆ కేటుగాడు చెప్పినట్లు వివరాలన్నీ ఇచ్చింది. అవి పరిశీలించిన సైబర్ క్రిమినల్.. ఆమె అకౌంట్లోంచి కోటి రూపాయలు తమకు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కేసునుంచి బయట పడేస్తామని లేదంటే.. బతుకు బస్టాండ్ అవుతుందని హెచ్చరించాడు. దీంతో, తన అకౌంట్లోంచి కోటి రూపాయలు వాడు చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత కూడా మరో 60 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తే.. కొందరి దగ్గర అప్పుగా తీసుకొని మరీ.. ఆ డబ్బులను వాళ్ల అకౌంట్కు పంపించింది లేడీ రిటైర్డ్ ప్రొఫెసర్.
అయితే, రోజులు గడుస్తున్నా.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో.. అసలు కేసులోంచి తన పేరు తొలగించారో, లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే.. వాళ్లు సైబర్ నేరగాళ్లని అర్థమయ్యింది. మోసపోయినట్టు గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో సీబీఐ పేరుతో డబ్బు డిమాండ్ చేసిన వాళ్లు ఎవరికి చెప్పవద్దని, లేకపోతే కేసు తీవ్రత పెరుగుతుందని బెదిరించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.