- ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్
- సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా పాటించనందుకు డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావును ఎమ్మార్వోగా డీమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013వ సంవత్సరంలో గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అప్పుడు తహసీల్దారుగా ఉన్న మోహనరావు పాటించకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 2014లో ఆక్రమణలన్నింటినీ తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొంది ఉన్న మోహనరావుకు ఏపీ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను డిప్యూటీ కలెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ పిటీషన్ గత సోమవారం విచారణకు రాగా సదరు అధికారి కోర్టు లోనే ఉన్నారని సుప్రీం ధర్మాసనానికి పిటీషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. ఈ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులు తాము చట్టానికి అతీతులమనే భావన కలిగి ఉండకూడదని ధర్మాసనం హితవు పలికింది. సదరు అధికారిని ఒక సారి కోర్టు హెచ్చరించినప్పటికీ అతను మళ్ళీ అదే చర్యకు పూనుకున్నాడని, అయన్ను ఎలా క్షమించాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అతను హైకోర్టు కన్నా పెద్దవాడు అని అనుకుంటున్నాడా అని సర్వోన్నత న్యాయస్ధానం మండి పడింది. హైకోర్టు ఆదేశాల్ని విస్మరించి, 80 మంది పోలీసులతో వెళ్లి ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించావని ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ ఉద్యోగి 48 గంటలకు కష్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని తీవ్రంగా హెచ్చరించింది. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు విజయవాడ జైలుకు పంపాలా తీహార్ జైలుకు పంపాలా ఏ జైలుకు వెళ్లలో నిర్ణయించకోవాలని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
విచారణ సందర్భంగా పెటేషనర్ తరపు న్యాయవాది డిప్యూటీ కలెక్టర్ కి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కోర్ట్ దృష్టికి తెచ్చినప్పుడు న్యాయమూర్తి గవాయ్ జోక్యం చేసుకొని అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు, వారి పిల్లలు ఎమవుతారు ?అని మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో, పిటిషన్ తీసుకోవడం సరికాదు. అయినా మేము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామన్న ధర్మాసనం మే 5న వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ప్రతివాదులకు న్యాయవాది అవసరం లేదని, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం లభిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. డిప్యూటీ కలెక్టర్ కొంతకాలం ప్రభుత్వ అతిథిగా ఉండాలి అని జస్టిస్ బి ఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలోనే డిప్యూటీ కలెక్టర్ ని మళ్ళీ తహసీల్దార్ గానో లేదా పట్వారీగానో పంపితే సరిపోతుందని కూడా వ్యాఖ్యానించింది. అన్నట్లుగానే న్యాస్ధానం ఆదేశాలను ఉల్లఘించినందుకు డిప్యూటీ కలెక్టర్ మోహనరావును తిరిగి తాహసీల్దారుగా డిమోట్ చేయానలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మోహనరావు ప్రొటోకాల్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.