- కశ్మీర్ సహా అనేక అంశాల్లో భారత్ కు సిరియా మద్దతు
- అల్ బషర్ లోటు భారత్ కు నష్టమేనా?
సిరియాలో అధ్యక్షపాలన అంతమవడం, రెబల్స్ దేశాన్ని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడంపై ప్రపంచ దేశాల ఆసక్తులు, ప్రయెజనాల మాటెలా ఉన్నా.. సిరియా , భారత సంబంధాలపై నే ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. భారత్ తో ఆ దేశానికి చాలా కాలం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 1957లో అమెరికా వెళ్లినప్పుడు మధ్యలో సిరియా రాజధాని డమాస్కస్ లో కొద్దిసేపు ఆగారు. సిరియా, భారత దేశం మధ్య సంబంధాలు ఏడేళ్ల క్రితమే కొత్త పుంతలు తొక్కాయి.ప్రధాని నెహ్రూ పర్యటనకు గుర్తుగా ఆ దేశం తమ చారిత్రక ఉమ్మాయద్ స్క్వేర్ కు పండిట్ నెహ్రూ స్ట్రీట్ అని పేరు మార్చింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎన్నో ఆటు పోట్లను చవిచూశాయి. భారత్ లో ప్రభుత్వాలు మారడం, సిరియాలో అంతర్గత ఘర్షణల వల్ల కొంత కాలం స్నేహ సంబంధాలు దెబ్బ తిన్నా మళ్లీ పునరుద్ధరణకు నోచుకున్నాయి. అయితే ఇపుడు అధ్యక్షుడు అల్ బషర్ లేకపోవడం వల్ల రెండు దేశాల స్నేహ సంబంధాలపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.
కశ్మీర్ పై భారత్ కు సిరియా మద్దతు
సిరియా , భారత దేశాల మధ్య స్నే హ సంబంధాలు మెరుగు పడినది మాత్రం నియంత అల్ బషర్ నేత్రుత్వంలోనే. బషర్ ఆయన తండ్రి ఇద్దరూ భారత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా కశ్మీర్ అంశంపై భారత్ నిర్ణయాలకు మద్దతు పలికిన దేశం సిరియా.కశ్మీర్ అంశం ఆ దేశ అంతర్గత వ్యవహారమని బాహాటంగా సిరియా చెప్పింది.పైగా కశ్మీర్ పై మన కేంద్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కూడా సమర్ధించింది.ఈ అంశంలో ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ పాకిస్థాన్ కు మద్దతు తెలిపితే సిరియా మాత్రం భారత్ కు మద్దతు తెలిపింది. ఎంతలా అంటే 2019లో కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని ఉపసంహరించినప్పుడు కూడా అది భారత్ ఆంతరంగిక వ్యవహారమని కామెంట్ చేసింది సిరియా.అల్ బషర్ లౌకిక వాద పాలన తో రెండు దేశాలు పరస్పరం సహకారంతోనే అడుగులేసేవి. అప్పట్లో మన దేశానికి రాయబారిగా వచ్చిన రియాద్ అబ్బాస్ సైతం భారత ప్రజల సార్వబౌమాధికారాన్ని కాపాడటం కోసం ఏం చేసినా అది వారిష్టమని కశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని అన్నారు.2003లో అప్పటి ప్రధాని వాజపేయి సిరియా పర్యటించి చిన్న పరిశ్రమలు, విద్య, బయోటెక్నాలజీ లాంటి రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సిరియాను సందర్శించారు.2008లో సిరియా అధ్యక్షుడు అల్ బషర్ భారత్ పర్యటించారు.ఆర్ధిక సంబంధాలే కాదు, సాంస్క్రుతిక బంధాలనూ పటిష్టం చేసుకున్నారు. అంతేకాదు వ్యవసాయం , విద్య రంగాలలో కీలక అవగాహనా ఒప్పందాలు కూడా జరిగాయి. సిరియాలో అపారంగా ఉన్న ఫాస్పేట్ నిల్వలపై భారతీయ సైంటిస్టులు పరిశోధనలు చేయవచ్చని అల్ బషర్ ఆహ్వానించారు. టెక్స్ టైల్స్, మెషినరీ, ఫార్మసూటికల్స్ రంగాల్లో సిరియాకు ఏగుమతులు జరగగా అక్కడ ఉన్నరాక్ ఫాస్పేట్,పత్తిల ను మన దేశం దిగుమతి చేసుకుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా మెరుగు పడ్డాయి.