- 17 న జరిగే క్యాబినెట్ లో ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభం
- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
- రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు లైన్ క్లియర్
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. 37వేల 702.15 కోట్ల రూపాలయ విలువైన పనులకు సంబంధించిన టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. ఈనెల 17వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ పనులన్నింటికీ ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన 73 పనులకు సీఆర్డీఏ మరియు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. వీటిలో దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన పనులకు సంబందించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి నేడు సీఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందడం జరిగిందన్నారు. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ మొత్తం 59 పనుల్లో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ.22,607.11 కోట్ల అని, ఏడిసి కి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ.15,095.04 కోట్లని ఆయన తెలిపారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులుకాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబందించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన 2 పనులకు సంబందించిన టెండర్లను ఈ నెల 17 వ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఇవి కాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసందానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబందించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపడతామని అన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబందించి 2014 – -19 మద్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించడం జరిగిందన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్దికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చువుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఏమాత్రము ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా జరుగుతుందన్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సీఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవి అన్నీ పోగా ఇంకా సీఆర్డీఏ వద్ద అభివృద్ది చేయబడిన స్థలం దాదాపు 4,000 ఎకరాలు ఉంటుందన్నారు. ఆ భూమి తనకా పెట్టడం ద్వారా మరియు వేలం పాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మించడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.