హైదరాబాద్ స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అండగా నిలబడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ సీనియయర్ నాయకులు, జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మజ్లీస్ తో చేతులు కలిపిన ఈ రెండు పార్టీలు సెక్యులర్ ఎలా అవుతాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని సెక్యులర్ అని ప్రచారం చేసుకుంటున్నారని నిలదీశారు. మజ్లీస్ పార్టీ రజాకార్ల వారుసల పార్టీ అని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఓటింగ్ కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను బెదిరిస్తోందని ఇది గ్రేటర్ ప్రజలను అవమానించడమే అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడంలేదో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్లీస్ కు ఓటు వేయమని బీఆర్ఎస్ ఎందుకు చెప్పడం లేదని కిషన్ రెడ్డి నిలదీశారు. కార్పొరేటర్లు ఓటు వేయకపోతే వారికి వారికి ఓట్లు వేసిన ప్రజలను అవమానించినట్లే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అసదుద్దీన్ ఓవైసీ సూపర్ బాస్ అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. డిపాజిట్లు రావని తెలిసినా పాతబస్తీలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తాయని మజ్లీస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని విమర్శించారు. మజ్లీస్ చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కీలుబొమ్మలని, ఈ మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని పోటీలో పెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. గెలుపు మీద మాకు నమ్మకముందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.