యువతే మన రాష్ట్రానికి వనరులని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సారథ్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం భట్టి విక్రమార్క ఈ జాబ్మేళాను ప్రారంభించారు. ఈ ఉద్యోగ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇవాళ ఒక్కరోజే 5వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మధిరలోని రెడ్డి గార్డెన్స్లో జరుగుతున్న ఈ జాబ్ మేళాకు వేల సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఆ కొద్దిమందికే ఉద్యోగాలు దొరికాయని, గత పదేళ్లలో నిరుద్యోగులు, ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పన సాగుతోందన్నారు. ఒకటేమో ప్రభుత్వ ఉద్యోగాలు అయితే, రెండోది బహుళ జాతి సంస్థలకు అవసరమైన వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే, మూడోది చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా మరో 5వేల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవాళ మధిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకేరోజు ఉపాధి కల్పించబోతున్నామన్నారు. యువతే రాష్ట్రానికి వనరులుగా తమ ప్రభుత్వం భావిస్తోందని, వారు రాష్ట్ర భవిష్యత్తుకు, జీడీపీ పెరుగుదలకు తోడ్పడాలన్నారు. అలాగే, కుటుంబానికి, సమాజానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేలా యువత రూపుదిద్దుకోవాలన్నారు. ప్రతి ఆలోచన మంచిది అయితే మంచి ఫలితాలు సాధిస్తారని, యువత మత్తు పదార్థాలు, సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. చివరి దశలో తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోవాలన్నారు.