30.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

బర్డ్‌ ఫ్లూ కాలంలో దిమ్మదిరిగే ప్లాన్‌ – వింటే మైండ్‌ బ్లాంక్‌

బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ రైతులకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. బర్డ్ ప్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ తినొద్దని ప్రభుత్వాలు సైతం ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ఓ వ్యక్తిలో బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్ర సరిహద్దుల్లో నుంచి కోళ్లను తెలంగాణలోకి రానివ్వకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇక, బర్డ్ ప్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మొన్నటిదాకా కిలో చికెన్ ధర రూ.230 నుంచి రూ.250 వరకు పలకగా.. ఇప్పుడు అది రూ.150 కి పడిపోయింది. దీంతో పౌల్ట్రీ సంస్థలు దారుణంగా నష్టపోతున్నాయి. బర్డ్ ప్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ అమాంతం పడిపోయింది. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు హైదరాబాదులో దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్‌ దందా బట్టబయలయ్యింది.

హైదరాబాద్‌లోని రసూల్ పురా అన్నా నగర్ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో, దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ తనిఖీల్లో పాల్గొన్న అధికారులు ముక్కు మూసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో విస్తారంగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉంటాయి. వీటన్నింటికీ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల నుంచి చికెన్ సరఫరా అవుతుంది. చికెన్ కు ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో.. దానిని క్యాష్ చేసుకోవడానికి చికెన్ సప్లయర్స్ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు. తక్కువ ధరకు కోళ్లను కొని.. వాటి మాంసాన్ని నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హైదరాబాద్ నగరంలోని వివిధ రెస్టారెంట్లకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.

అయితే, ఈ కంత్రీ దందాపై సమాచారం అందడంతో అధికారులు రసూల్ పుర ప్రాంతంలోని అన్నా నగర్ లో దాడులు నిర్వహించారు. అక్కడ ఐదు క్వింటాళ్లకు పైగా కుళ్ళిన చికెన్ కనిపించింది. పైగా ఆ చికెన్ తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దీంతో.. షాక్‌కు గురికావడం అధికారుల వంతు అయింది. బర్డ్ ప్లూ నేపథ్యంలో చికెన్ తక్కువ ధరకు దొరుకుతున్న కారణంగా.. రెస్టారెంట్లకు పాత రేటుకే సప్లయర్స్ అమ్ముతున్నారు. పైగా తక్కువ ధరకు కోళ్లను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి.. వాటిని వధించి ఇలా చికెన్ నిల్వ చేస్తున్నారు.

బ్రాయిలర్ చికెన్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. దానిని నిల్వ ఉంచాలంటే రసాయనాలు వాడాల్సి ఉంటుంది. అలాంటి పనిని కొంతమంది సప్లయర్స్ చేస్తున్నారు. అయితే, వారి దుర్మార్గం ఇప్పుడు ఇలా అధికారుల తనిఖీలతో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలానే కుళ్ళిన చికెన్ నిలువ చేసిన సంఘటనలున్నాయి. ఆ సమయంలో కూడా అధికారులు కుళ్లిన చికెన్‌ సీజ్‌ చేసి.. బాధ్యులపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అయినా చికెన్‌ సప్లయర్స్ తమ ధోరణి మార్చుకోవడం లేదు. అడ్డగోలుగా దోచుకోవడానికి ఇలా కుళ్ళిన చికెన్ అమ్ముతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com