పండుగలకు నేను మా సొంత ఊరు వెళ్లే సాంప్రదాయానికి భువనేశ్వరే కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్లు వెళ్లి నలుగురితో కలవడం అలవాటు చేసుకోవాలని సీయం సూచించారు. సమాజంలో పై స్ధాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ అవుతుందన్నారు. నేను అందుకే మా ఊరికి ప్రతి సంక్రాంతికీ వెళుతున్నానని చెప్పారు. పాతికేళ్ళ క్రితం భువనేశ్వరి పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామన్నారు. గత సంక్రాతితో పోల్చితే చాలా వరకూ రహదారులను మెరుగుపరిచామని వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగుచేస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్ ను అనకాపల్లి జిల్లా పూడిమడక తీసుకువచ్చి వాటి ద్వారా హైడ్రజన్ ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలను ఉచితంగా పెడున్నామని మిగిలిన వారికి కూడా కేంద్ర రాయితీ పోను మిగిలిన సౌర ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్ధీకరిస్తున్నామని 2500 లోపు జనాభా వరకూ ఒక తరహా సచివాలయం 2500 నుంచి 5వేల జనాభా వరకూ ఒక తరహా, 5వలే పైబడిన వాటిని మరో జాబితాలోకి తెచ్చి అందుకు అనుగుణంగా ఉద్యోగులను సర్ధుబాటు చేస్తామని వివరించారు. మిగిలిన వారిని సబంధిత శాఖలకు అటాచ్ చేస్తామని తెలిపారు.