- దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
- దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు
- హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, దగ్గుబాటి రానా, అభిరామ్ లపై కేసు నమోదు
కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చెయ్యకుండా దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్కన్ కిచెన్ హోటల్ ని అక్రమంగా కూల్చి వేశారన్న ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితుడు నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం తలెత్తింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ అంశం కోర్టులో ఉండగానే 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. యథాతథ స్థితి కొనసాగించాలని స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా 2024 జనవరిలో హోటల్ ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసింది. దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంపై మళ్లీ నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లరుజ. శనివారం నందకుమార్ పిటీషన్ను విచారించిన కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.