విలేకరులు సమగ్ర అధ్యయనంతో కథనాలు రాయాలని హితవు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం బీట్ రిపోర్టర్లకు వివిధ అంశాలపై అవగాహన ఎలా పెంచుకుని వార్తలు రాయాలనే అంశంపై సోమవారం కౌన్సలిగ్ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి ఖర్చుపెట్టబోతున్న బడ్జెట్ వివరాలను వెల్లడించడానికి సోమవారం ఏపీ సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన విలేకరులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. సాగు నీటి ప్రాజెక్టులపై విలేకరులకు పూర్తి అవగాహన ఉండాలని, అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విలేకరులు దీనిని స్టడీ చేయాలని పూర్తి అవగాహనతో వార్తలు రాయాలని, ప్రజలలో ఆలోచన కల్పించి, సానుకూల కథనాలతో వాళ్లని ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. అందుకే ముందు అవగాహనతో వార్తలు రాయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎంత ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం సాధ్యమవుతుందన్న ప్రశ్నకు ఇంకా అంచనా వేయలేదని అన్నారు. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనని తాము కష్టపడి ప్రాజెక్టులు కడుతుంటే.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటిని ధ్వంసం చేసి మరుగున పడేలా చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధపడుతుందన్నారు. తాము అనుకున్న ప్రాజెక్టుల ద్వారా మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.