ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కాల్మనీ అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. ఏపీలోని తాడేపల్లి పరిధిలో ఆంజనేయులు అనే కూరగాయల వ్యాపారి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ కుటుంబసభ్యుల అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డ ఆంజనేయులు.. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అప్పుల వాళ్లు, వడ్డీ వ్యాపారులు తనను వేధిస్తున్నారని తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కూరగాయల వ్యాపారి ఆంజనేయులు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఆ సెల్ఫీ వీడియో ఇవాళ బయటకు రావడంతో కలకలం చెలరేగింది. అయితే, ఈ సంఘటన ఈనెల 28వ తేదీన జరిగిందని, వీడియో ఆలస్యంగా బయటకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం.. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కాలువ కట్టపై పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అక్కడినుంచి ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆంజనేయులును మొదట మంగళగిరిలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.
ఆంజనేయులు తన సెల్ఫీ వీడియోలో తన మరణానికి కారణం నలుగురు అంటూ వాళ్ల పేర్లు చెప్పాడు. తన చావుకు కారణం హరీష్, మణి, జొన్నపూడి కాళిదాసు, ప్రేమ్ అంటూ వీడియోలో రికార్డ్ చేశాడు. అయితే, సెల్ఫీ వీడియోలో, తాను చేసిన అప్పులకు, ఇతర ఇబ్బందులకు తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఎటువంటి హాని తలపెట్టవద్దని ఆంజనేయులు కోరారు. ఈ విషయాన్ని పోలీసులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. బంధువులే తనను హేళనగా మాట్లాడారని, మనస్తాపానికి గురై మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో వెల్లడించారు. సెలవు తీసుకుంటున్నాను.. బై అంటూ వీడియో ముగించారు. అయితే, ఆంజనేయులుకు ఎంత అప్పు ఉంది? అతన్ని ఎవరెవరు వేధించారన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.