సముద్ర తీరంలో వింత పరిణామం చోటు చేసుకుంటోంది. కొంతకాలంగా తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. అలా చనిపోయిన తాబేళ్లు సముద్రతీరానికి కొట్టుకొస్తున్నాయి. అంతుచిక్కని ఈ పరిణామంతో స్థానికులు, సముద్ర తీర ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైన వానిలంక సముద్రతీరంలో ఈ దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. తరచూ తాబేళ్ళు మృత్యువాత పడుతున్నాయి. గత రెండు రోజుల్లోనే 15 కు పైగా తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఇలా చనిపోయి వరుసగా తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకొస్తుండటం పట్ల నిత్యం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు వల్లే సముద్రంలో మత్స్య సంపద, తాబేళ్ళు చనిపోతున్నాయని చెబుతున్నారు. మృత తాబేళ్లు అలా కొట్టుకు వచ్చి సముద్రతీరంలోని ఇసుక దిబ్బల్లో కనిపిస్తుండటం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని మత్స్యకారులు కోరుతున్నారు. సముద్ర సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.